మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ప్రకృతి వనాలు ఏర్పాటు
ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించే దిశగా ప్రభుత్వం కృషి
ఘట్కేసర్, డిసెంబర్ 11 : పట్టణ ప్రకృతి వనాలతో మున్సిపాలిటీల్లో పచ్చదనం వెల్లివిరుస్తున్నది.ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీల్లో ప్రజలకు పచ్చదనంతో పాటు, స్వచ్ఛమైన గాలి అందించాలన్న సంకల్పంతో ప్రతి మున్సిపాలిటీలో వార్డుల వారీగా ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనాలు స్థానికంగా పచ్చదనాన్ని పంచుతున్నాయి. ప్రతి మున్సిపాలిటీలో ప్రతి వార్డుకు ఒక ప్రకృతి వనం చొప్పున ప్రభుత్వం మున్సిపాలిటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. వీటిలో 2వేల నుంచి 4 వేల వివిధ రకాల మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు.
ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీల్లో 18 చొప్పున వార్డులు ఉన్నాయి. దీంతో ప్రతి వార్డుకు ఒకటి చొప్పున ప్రకృతి వనం ఏర్పాటు చేసి పచ్చదనంతో పాటు ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నారు. ఒక్కో ప్రకృతి వనానికి రూ.15లక్షల నుంచి 20 లక్షలు కేటాయించి ఏర్పాటు చేశారు.ప్రభుత్వ, ప్రైవేట్ వెంచర్లలోని పార్కు, ఖాళీ స్థలాల్లో వీటిని ఏర్పాటు చేసి ఒక ఫీటుకు ఒక మొక్క చొప్పున నాటి సంరక్షిస్తున్నారు.
ప్రభుత్వం ఆధ్వర్యంలో మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనాలు స్థానిక ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. పచ్చదనంతో పాటు ప్రజలు మార్నింగ్వాక్ చేసేందుకు ట్రాక్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు పచ్చదనం అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ వనాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.
-ఏఈ ఎస్.శ్రీనివాస్, ఘట్కేసర్ మున్సిపాలిటీ