బయటకు రాగానే డ్రగ్స్ దందా షురూ
ద్విచక్రవాహనంపై తిరుగుతూ డ్రగ్స్ సరఫరా
థాయ్ల్యాండ్ దేశం సిమ్తో ఫోన్లు.. కాంటాక్ట్స్ అన్నీ డిలీట్..
జైలుకు వెళ్లొచ్చినా మారని నైజీరియా దేశస్థుడు
ఓలాబీతో పాటు మరో ముగ్గురు అరెస్టు
రిమాండ్కు తరలిస్తుండగా.. చప్పట్లు కొడుతూ అల్లరిచేసిన నిందితుడు
డ్రగ్స్ అమ్మినా…సేవించినా.. 10 ఏండ్లు జైలు శిక్ష
హెచ్చరించిన రాచకొండ కమిషనర్ మహేశ్భగవత్
సిటీబ్యూరో, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): జైల్లో పరిచయమైన గంజాయి సరఫరాదారుడితో కలిసి నైజీరియాకు చెందిన డ్రగ్స్ స్మగ్లర్ మార్క్ ఓలాబీ తన వ్యాపారాన్ని హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలో విస్తరించుకున్నాడు. ఎవరికి కావాలన్నా తానే స్వయంగా ద్విచక్ర వాహనంపై తిరుగుతూ అందిస్తున్నాడు. ఓలాబీ కాంటాక్ట్స్ డైరీలో చాలా మంది ఉన్నప్పటికీ వాటిని ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ జాగ్రత్తపడ్డాడు. ఇలా గత పదేండ్లుగా అక్రమంగా దేశంలో ఉంటూ డ్రగ్స్ దందాను కొనసాగిస్తున్నాడు. గతంలో కొకైన్ను సరఫరా చేస్తూ అమీర్పేట, గోల్కొండ ఎక్సైజ్ పోలీసులకు చిక్కి.. జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా తీరు మార్చుకోకుండా యువతను డ్రగ్స్కు అలవాటు చేసేందుకు ప్రయత్నిస్తూ మంగళవారం రాచకొండ పోలీసులకు చిక్కాడు. ఓలాబీతో పాటు కొకైన్ను వినియోగిస్తున్న మరో ముగ్గురి పై పీడీ యాక్ట్ను విధిస్తామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు.
ఢిల్లీ నుంచి తీసుకువస్తున్నా…
డ్రగ్స్ను ఢిల్లీ నుంచి తీసుకువస్తున్నట్లు ఓలాబీ చెప్పినా అందుకు తగిన ఆధారాలు పోలీసులకు లభించలేదు. అయితే పోలీసుల దృష్టి మళ్లించేందుకే ఓలాబీ అబద్ధాలు చెబుతున్నట్లు తేలింది. అతనే స్వయంగా విదేశాల నుంచి తీసుకువస్తున్నాడా.. లేక ఎవరైనా సరఫరా చేస్తున్నారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. గతంతో ఓలాబీని గోల్కొండ, అమీర్పేట ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. అక్కడే గంజాయి కేసులో జైలుకు వచ్చిన అభిషేక్ సింగ్ పరిచయమయ్యాడు. అతడితో పాటు గంజాయి అలవాటు ఉన్న వారి కాంటాక్ట్స్ను సేకరించాడు. వారికి డ్రగ్స్ను సరఫరా చేస్తామని చెప్పి.. దందా సాగించాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఓలాబీతో పాటు తోట హర్షవర్ధన్, దుడ్డు పవన్కుమార్, గునపోగుల స్వామి ప్రసాద్లను అరెస్టు చేయగా మరో ప్రధాన సూత్రదారి అభిషేక్ సింగ్ పరారీలో ఉన్నాడు.
నన్ను టచ్ చేయండి.. చూస్తా..
ఓలాబీని అదుపులోకి తీసుకుని విచారించే సమయంలో అతను పోలీసులను ముప్పుతిప్పలు పెట్టినట్లు తెలిసింది. తనను టచ్ చేస్తే మా రాయబార కార్యాలయానికి ఫిర్యాదు చేస్తానని బెదిరించినట్లు సమాచారం. పోలీసుల విచారణకు ఏ మాత్రం సహకరించలేదు. డ్రగ్స్ నెట్వర్క్కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా జాగ్రత్త పడ్డాడు. ఫోన్లోని ప్రతి కాంటాక్ట్తో పాటు ప్రతి చాటింగ్ను ఎప్పటికప్పుడు డిలీట్ చేశాడు. కేవలం తన నైజీరియా దేశానికి చెందిన వారి కాంటాక్ట్లనే పెట్టుకున్నాడు. మరో వైపు థాయ్ల్యాండ్ దేశం చిరునామా ఉన్న వర్చువల్ నంబరు, సిమ్ కార్డులను ఉపయోగిస్తున్నాడని పోలీసుల దర్యాప్తులో వివరించాడు. దీంతో ఆ సిమ్ ద్వారా చేసిన కాల్స్ డాటా దొరకడం చాలా కష్టంగా మారింది.
రూ.15వేలకు కొకైన్ విక్రయం
ఓలాబీ రూ.15 వేలకు కొకైన్ను విక్రయిస్తున్నట్లు విచారణలో బయటపడింది. ఈ ఖరీదైన డ్రగ్స్ తీసుకున్న వారంతా సంపన్నులేనని పోలీసులు అంచనా వేస్తున్నారు. మీడియా సమావేశానికి వచ్చిన ఓలాబీని రిమాండ్కు తరలిస్తున్న సమయంలో అతను చప్పట్లు కొట్టుకుంటూ అల్లరి చేయడం కనిపించింది. అయితే అతడిపై నార్సింగి పీఎస్లో గడువు ముగిసినా.. దేశంలో ఉన్నాడంటూ అరస్టైన కేసు ఉంది. దీంతో మరోసారి ఆ కేసు నమోదు చేసే అవకాశం లేకుండా పోవడంతో దాని ఆధారంగా ఈ అక్రమ డ్రగ్స్ దందాతో పాటు పౌర సంబంధిత నిబంధనలను ఉల్లంఘిస్తున్నాడని తెలుస్తున్నది.
20 మంది ఆఫ్రికా దేశస్తులను వెనక్కి పంపాం…
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విదేశాలకు చెందిన వారైనా, స్థానికులైనా అక్రమ వ్యాపారాలకు పాల్పడితే వదిలి పెట్టేది లేదని పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ హెచ్చరించారు. వీసా గడువు ముగిసినా అక్రమంగా ఉంటున్న వారిని కూడా ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు దాదాపు 20 మంది దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన వారిని వెనక్కి పంపామని తెలిపారు. తాజాగా పట్టుబడిన ఓలాబీ తో పాటు మిగతా వారిపై పీడీయాక్ట్ను నమోదు చేస్తామని పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ సేవిస్తున్న వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్లోని సెక్షన్ 21(బీ), డ్రగ్స్ సరఫరా చేస్తున్న అక్రమ వ్యాపారులపై రెడ్ విత్ సెక్షన్ 29 కింద అభియోగాలను నమోదు చేస్తున్నామన్నారు. ఈ సెక్షన్ల కింద అభియోగాలు నిర్ధారణ అయితే 10 ఏండ్లు జైలు శిక్ష ఖాయమని సీపీ తెలిపారు.
ఢిల్లీ నుంచి హైదరాబాద్కు డ్రగ్స్..
హైదరాబాద్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియా దేశానికి చెందిన యువకుడిని మంగళవారం రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి ఖరీదైన 38 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్కు అలవాటు పడిన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నేరేడ్మెట్ రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. నైజీరియాకు చెందిన మార్క్ ఓలాబీ 2012 సంవత్సరంలో బిజినెస్ వీసా మీద ఇండియాకు వచ్చాడు. వీసా గడువు ముగిసినా ఇక్కడే తిష్ట వేశాడు. హైదరాబాద్ బంజారాహిల్స్ పారామౌంట్ హిల్స్ ప్రాంతంలో నివాసముంటూ డ్రగ్స్ దందా చేస్తున్నాడు. నేరేడ్మెట్లో తోట హర్షవర్ధన్, దుడ్డు పవన్కుమార్, గునపోగుల స్వామి ప్రసాద్లకు 38 గ్రాముల కొకైన్ను ఇవ్వడానికి వస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి, రాజు బృందం, నేరేడ్మెట్ ఇన్స్పెక్టర్ నరసింహస్వామి ఆధ్వర్యంలో పథకం ప్రకారం పట్టుకున్నారు. వీరిని అరెస్టు చేసి కొకైన్తో పాటు రూ.9.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు అభిషేక్ సింగ్ పరారీలో ఉన్నాడు. ఈ ముఠాను పట్టుకున్న అధికారులు, సిబ్బందికి సీపీ మహేశ్ భగవత్ రివార్డులను అందించారు. సమావేశంలో అదనపు సీపీ సుధీర్బాబు, మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తి, క్రైం డీసీపీ యాదగిరి, అదనపు డీసీపీ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.