సంస్థాన్ నారాయణపురం మండలంలో గంజాయి దందా జోరుగా సాగుతున్నది. కొందరు యువకులు గంజాయికి బానిసలుగా మారి జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. గతంలో పట్టణాలకు మాత్రమే పరిమితమైన గంజాయి చాపకింద నీరులా పల్లెలకూ వ్యాపించింది. సంస్థాన్ నారాయణపురం మండలంలో యువకులు గంజాయి మత్తులో భవిష్యత్ను అంధకారం చేసుకుంటున్నారు.
సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాక, జనగాం, సంస్థాన్ నారాయణపురం, వావిళ్లపల్లి, గుడిమల్కాపురం, కొత్తగూడెం గ్రామాల్లో కొందరు యువకులు గ్రామ శివారు ప్రాంతాలను అడ్డాలుగా ఏర్పాటు చేసుకుని గంజాయి తాగుతూ, పేకాట ఆడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఆ మత్తులో రోడ్ల పైకి వచ్చి గొడవలకు దిగుతున్నారు. బైక్లపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. పుట్టపాక గ్రామంలో రెండ్రోజుల క్రితం ఓ యువకుడు గంజాయి మత్తులో కాలనీలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. గ్రామస్తులు అతన్ని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. గ్రామాల్లో నిఘా ఏర్పాటు చేసి గంజాయి, పేకాటను అరికట్టి యువకులను గంజాయి బారి నుంచి కాపాడాలని పోలీసులను తల్లిదండ్రులు కోరుతున్నారు.
గంజాయి మత్తులో..
కొంతమంది యువకులు గంజాయి మత్తుకు బానిసవుతున్నారు. కొందరు యువకులు భావించి సిగిరెట్లో తంబాకును తీసేసి గంజాయిని నింపి తాగుతున్నారు. మరికొందరు ఓసీబీ పేపర్లు వాడుతూ గంజాయి తాగుతున్నారు. ఇలా గంజాయికి అలవాటు పడినవారు రోజులో ఒక్కసారైనా గంజాయి పీల్చకుంటే పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నారు. ఒక దశలోయువకులు బైకులు, సెల్ఫోన్లు, ల్యాప్టాప్, బంగారం కుదువపెట్టి గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా గ్రూప్గా ఏర్ప డి గంజాయి మత్తులో రూ.10 నుంచి 50 వేల వరకు బెట్టింగులు పెడుతూ పేకాట ఆడుతున్నారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి బిస్కెట్లు అమ్మేవారి ద్వారా గంజాయి సరఫరా అవుతున్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. 30 గ్రాముల చొప్పున చిన్న చిన్న ప్యాకెట్లలో నింపి రూ.100 నుంచి 500 వరకు విక్రయిస్తున్నారు. గంజాయికి అలవాటు పడ్డ యువకులు తల్లిదండ్రులపై భౌతిక దాడులకు సైతం దిగుతున్నారు. తమ బిడ్డలను తమ దారికి తెచ్చుకోలేక ఎవరికీ చెప్పుకోలేక తల్లిదండ్రులు తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు.
పట్టించుకోని పోలీసులు..!
గంజాయి విక్రయాలపై పోలీసులు దృష్టి పెట్టడం లేదని ఆరోపణలు ఉన్నాయి. పుట్టపాక గ్రామంలో రెండు నెలల క్రితం ఓ యువకుడు గంజాయి తాగుతుండగా గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతని వద్ద గంజాయి ట్యాబ్లెట్లు లభించాయి. అయినా.. ఈ విషయంపై పోలీసులు దృష్టి పెట్టలేదని ఆరోపణలు వస్తున్నాయి.
కఠిన చర్యలు తీసుకుంటాం..
మండలంలో కొందరు యువకులు గంజాయి తాగుతూ ఆడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. వాటిని అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం. గంజాయి, పేకాట ఆడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుంటాం. మత్తు పడి నాశనం చేసుకోవద్దు.