చార్మినార్ : మధ్యాహ్నం వరకు సందర్శకులతో సరదాగా సాగుతున్న జూ పార్క్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. లయన్మోట్పై నిలబడి ఓ వ్యక్తి ఎన్క్లోజర్లోకి దూకేందుకు చేస్తున్న ప్రయత్నాలను గమనించిన సందర్శకులు ఒక్క సారిగా అప్రమత్తమై జూ సిబ్బందికి సమచారాన్ని అందించారు.
జూ పార్క్, బహదూర్ఫుర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కీసర ప్రాంతానికి చెందిన సాయికుమార్ (31) స్థానికంగా హోటళ్లలో పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నాడు.మంగళవారం జూ పార్క్ సందర్శన కోసం వచ్చిన సాయికుమార్ 3.30 గంటల సమయంలో ఆఫ్రికన్స్ లయన్స్ మోట్ వద్దకు చేరుకున్నాడు.
అనంతరం లయన్ మోట్ (రక్షణగోడ) పై నిలబడి సింహాల వద్ద రత్నాభరణాలు ఉంటాయని అరుస్తూ (లయన్స్ పేర్లు రాధ, కృష్ణ ) ఎన్క్లోజర్లోకి దూకడానికి ప్రయత్నించాడు. అప్పటికే జూ అధికారులు సింహాలను సందర్శకులు తిలకించడానికి ఎన్క్లోజర్లోకి వదిలేయడంతో సందర్శకులు, జూ అధికారులు ఒకింత ఆందోళనకు గురయ్యారు.
అప్రమత్తమైన సందర్శకులు, జూ పార్క్ సిబ్బంది సాయికుమార్ ప్రయత్నాలను నిలువరిస్తూ అతన్ని పట్టుకున్నారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని బహదూర్పుర పోలీసులకు అప్పగించారు. సాయికుమార్ మానసిక స్థితి బాగ లేనట్టు గుర్తించామని బహదూర్పుర ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ తెలిపారు.