చిక్కడపల్లి : భార్యా బాధితుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2022 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు జి.బాలాజీ రెడ్డి సంఘం క్యాలెండర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మానవ హక్కులు, సమాజ శ్రేయస్సు కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాల చట్టాల్లో మార్పులు తెచ్చారని వివరించారు. ముఖ్యంగా మహిళలకు అనేక రకాల చట్టాలు తీసుకొచ్చారని తెలిపారు.
ఈ చట్టాలను సద్వినియోగం చేసుకోకుండా కొంత మంది మహిళలు దుర్వినియోగం చేసి పురుషుల హక్కులను హరిస్తున్నారన్నారు. పురుషుల హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో సంఘం తెలంగాణ అధ్యక్షుడు రాంబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సుమిత్, నాయకులు చంద్ర, రమేశ్, తరుణ్, రాంమోహన్ రావు, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.