నీలగిరి, జనవరి16 : తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల సంక్షేమానికి వేల కోట్లతో వినూత్న కార్యక్రమాలు చేపట్టి వారిని అక్కున చేర్చుకున్న సంక్షేమ ప్రదాత సీఎం కేసీఆర్ అని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని యాదవ సంఘం భవన్లో రాష్ట్ర గొర్రెలు, మేకల పెంపకందారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బలరాజు యాదవ్కు జిల్లా యాదవ, యాదవ ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలకు చేయూతనిచ్చేందుకు చేపట్టిన అనేక పథకాలు ఆయా జాతులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు దోహదపడ్డాయన్నారు. నీతి, నిజాయితీకి మారుపేరు అయిన యాదవులను గుర్తించిన సీఎం కేసీఆర్ వారికి తగిన ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఎంపీ, రెండు ఎమ్మెల్యేలు ఇవ్వడమే కాకుండా మరో యాదవ బిడ్డకు కార్పొరేషన్ పదవి ఇచ్చారన్నారు. ఈ పదవిని సమర్థవంతంగా నిర్వహించి భవిష్యత్లో మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. సన్మాన గ్రహీత బాలరాజు యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో తన పాత్రను గుర్తించిన సీఎం కేసీఆర్ నిరుపేద కుటుంబంలో పుట్టిన తనకు కార్పొరేషన్ చైర్మన్గా నియమించడంపై ధన్యవాదాలు తెలిపారు. రైతులు, మహిళలు, వృద్ధుల ఆత్మగౌరవం నిలబెట్టేందుకు వేల కోట్లు వెచ్చించిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. సీఎం కేసీఆర్ తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి యాదవ కుటుంబానికి న్యాయం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ మాట్లాడుతూ యాదవులపై సీఎం కేసీఆర్కు అమితమైన ప్రేమ ఉందని పేర్కొన్నారు. ఎంపీపీలు కన్నెబోయిన జ్యోతి, రేణుక, కర్నాటి స్వామి, సంఘం జిల్లా అధ్యక్షుడు లొడంగి గోవర్ధన్, నాయకులు సోమనబోయిన సుధాకర్యాదవ్, ఎల్వీ యాదవ్, చీర పంకజ్యాదవ్, పోలెబోయిన నర్సయ్య యాదవ్, మామిడి పద్మ, దూదిమెట్ల సత్తయ్య యాదవ్, పిల్లి రామరాజు యాదవ్, పల్లెబోయిన కాశీరాములు యాదవ్, గుండెబోయిన లక్ష్మయ్య యాదవ్, కె.పర్వతాలు యాదవ్, గోపాలకృష్ణ యాదవ్, ఆవుల రామన్న యాదవ్, కౌన్సిలర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.