మన్సూరాబాద్ : అత్యాధునిక హంగులతో ఫతుల్లాగూడలో నిర్మిస్తున్న మహాప్రస్థానం పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.
నాగోల్ డివిజన్ బండ్లగూడ పరిధి ఫతుల్లాగూడలో 6ఎకరాల స్థలంలో రూ. 21 కోట్లతో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల కోసం వేర్వేరుగా నిర్మిస్తున్న పనులను సోమవారం ఆయన ఆయా మతాల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ, ముస్లిం, కైస్తవుల కోసం వేరు వేరుగా నిర్మిస్తున్న మహాప్రస్థానం నగరానికి ఆదర్శంగా నిలువనుందని తెలిపారు.
బ్రాహ్మణులు అపరకర్మలు చేసుకునేలా వారి కోసం అధనంగా భవనం నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. మహాప్రస్థానంలో పచ్చదనాన్ని పెంపొందించి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసకుంటున్నట్లు తెలిపారు.
స్మశానవాటికల్లో స్నానాల గదులు, మూత్రశాలలతో పాటు అంత్యక్రియలను ప్రజలు వీక్షించేలా సిట్టింగ్ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రెండు నెలల్లో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి, ఎస్ఈ పరంజ్యోతి, డీఈ వెంకటరమణ, ఆర్కిటెక్ రాజశేఖర్, అర్భన్ ఫారెస్ట్ డైరెక్టర్ ప్రభాకర్, హర్టికల్చర్ అధికారి విజయభాస్కర్, మాజీ కార్పొరేటర్లు చెరుకు సంగీత, ముద్ర బోయిన శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.