అన్నదాతలు ఇబ్బంది పడొద్దనేధాన్యం కొనుగోళ్లు
సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు
తాలు, తేమ లేకుండా కేంద్రాలకు తేవాలి
కరోనా నివారణకు శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచాలి
మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు,సత్యవతి రాథోడ్
ధాన్యం కొనుగోళ్లు, కొవిడ్ పరిస్థితులపై వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష
హన్మకొండ, ఏప్రిల్ 5 : రైతులను కష్టకాలంలో ఆదుకోవాలన్న సంకల్పంతో దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలంగాణలోనే సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోళ్లకు సిద్ధపడ్డారని, ఆయన రైతు బాంధవుడని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫ రా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, స్త్రీ శిశు సంక్షే మం, గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు. ధాన్యం కొనుగోళ్లు, కొవిడ్ పరిస్థితులపై వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులతో సోమవారం హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్లో సమీక్ష నిర్వహించారు. కరోనా కారణంగా ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా రైతులు ఇబ్బం దిపడొద్దనే రూ.20వేల కోట్ల బ్యాంకు గ్యారంటీతో ధాన్యం కోనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. రైతుల మేలు కోరుతున్న సీఎం నిర్ణయానికి తగినట్లుగా అధికారులు పనిచేయాలని, ఇటు రైతులు సైతం సహకరించాలన్నారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయని, కాళేశ్వరం, దేవాదుల, ఎస్పారెస్పీ ప్రాజెక్టుల ద్వారా సమృద్ధిగా సాగునీరు అందుబాటులోకి వచ్చిందని, మరోవైపు మిషన్ కాకతీయ ద్వారా బాగైన చెరువులను నీటితో నింపడంతో రైతులు యాసంగిలో వరి సాగు ఎక్కువగా చేశారని, దీంతో వానకాలం కంటే యాసంగిలోనే ఎక్కువ సాగు జరిగిందని చెప్పారు. వరి దిగుబడులు అధికంగా వచ్చే అవకాశముందని, ఇందుకు తగ్గట్లు కొనుగోలు కేంద్రాలు, ఇతర ఏర్పాట్లు చేయాలని, అధికారులు సమన్వయంతో సమయాత్తం కావాలని ఆదేశించారు.
గతంలో మాదిరే కొనుగోళ్లు
గతంలో మాదిరిగానే ఐకేపీ, పీఏసీఎస్, మార్కెటింగ్, ఓడీసీఎంఎస్, డీసీసీబీల ద్వారా కొనుగోళ్లు చేస్తామని మంత్రులు తెలిపారు. ఈసారి కేంద్రాలు ఏర్పాటు చేయాలని, గోదాముల సామర్థ్యం పెంచాలని, వెంటనే రైస్ మిల్లర్లతో మాట్లాడి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాన్స్పోర్ట్, హమాలీల సమస్య లు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సెంటర్ల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, శానిటైజర్లు, మాస్కు లు అందుబాటులో ఉంచాలన్నారు. రైతుబంధు సమితు లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీడీవోలు, ఎంపీవో లు, గ్రామ కార్యదర్శులను కొనుగోళ్లలో భాగస్వాములను చేయాలని పేర్కొన్నారు. కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, డీఆర్డీవోలు, ఆర్డీవోలు, డీపీవోలు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా పక్క రాష్ర్టాల నుంచి వచ్చే ధాన్యాన్ని అదుపు చేయాలని ఆదేశించారు.
టోకెన్ పద్ధతి పాటించాలి
రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విధిగా టోకెన్ పద్ధతి పాటించాలని మంత్రులు సూచించారు. తేమ, తాలు లేకుండా నిబంధనల ప్రకారం ధాన్యాన్ని తేవాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో రైతులను చైతన్యం చేసేందుకు కరపత్రాలు, వాల్ పోస్టర్లు, డప్పు చాటింపు ద్వారా ప్రచారం చేయాలన్నారు. నిబంధనల బోర్డులను కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాటు చేయలన్నారు. వచ్చే వానకాలం కోసం రైతులను ఇప్పటి నుంచే సమాయత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. సన్న రకం వేయాలని, పత్తి అధికంగా పండించాలని, పప్పు ధాన్యాలు పండించాలని, ఆయిల్ పాం సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామి, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మం తు, ఎం.హరిత, నగర కమిషనర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
విద్యాసంస్థల మూసివేతకు నిరసనగా బీహార్లో ఆందోళనలు
కరోనా వ్యాక్సిన్ ఎగుమతులు : కేంద్రంపై ఆప్ ఫైర్