Sussanne Khan | బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, ఆయన మాజీ భార్య సుసానే ఖాన్ విడిపోయి దాదాపు పన్నెండేళ్లు అవుతున్నప్పటికీ, ఇప్పటికీ వారి విడాకులు, భరణంపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సుసానే ఖాన్ హృతిక్ రోషన్ నుంచి రూ. 400 కోట్ల భారీ భరణం తీసుకుందని గత కొన్ని ఏండ్లుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా స్పందించిన ఆమె సోదరి, ప్రముఖ డిజైనర్ ఫరా ఖాన్ అలీ ఈ పూకర్లను ఖండించారు.
ఒక ఇంటర్వ్యూలో ఫరా ఖాన్ మాట్లాడుతూ.. నా చెల్లి(సుసానే ఖాన్)కి రూ. 400 కోట్ల భరణం చెల్లించారనేది పచ్చి అబద్ధమని, అటువంటి వార్తలు చూసినప్పుడు తనకు చాలా బాధేస్తుందని అన్నారు. తన సోదరి సుసానే హృతిక్ నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, ఆమె కేవలం డబ్బుకు ఆశపడే వ్యక్తి కాదని స్పష్టం చేశారు. తాము ఒక సంప్రదాయమైన, గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చామని, భౌతిక సుఖాల కంటే బంధాలే ముఖ్యమని తమ తల్లి తమకు నేర్పించిందని ఆమె గుర్తుచేశారు. అందుకే విడాకుల తర్వాత కూడా హృతిక్ రోషన్, ఆయన తల్లిదండ్రులు రాకేష్ రోషన్, పింకీ రోషన్లతో సుసానేకు ఇప్పటికీ అద్భుతమైన మరియు గౌరవప్రదమైన అనుబంధం ఉందని, వారంతా ఆమెను ఎంతో ప్రేమిస్తారని తెలిపారు.
విడాకుల సమయంలో ఈ పుకార్లను ఖండించాల్సిందిగా తాను సుసానేకు చెప్పినప్పుడు, ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారనేది నాకు అనవసరం అంటూ సుసానే చాలా హుందాగా వ్యవహరించిందని ఫరా పేర్కొన్నారు. హృతిక్ రోషన్ తన కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు, ‘కహో నా ప్యార్ హై’ సినిమాతో సూపర్ స్టార్గా మారిన తరుణంలో సుసానేను వివాహం చేసుకున్నారని, ఆ సమయంలో హృతిక్ తల్లిదండ్రులు కొంచెం కాలం ఆగాలని కోరినప్పటికీ, వారిద్దరూ అమితంగా ప్రేమించుకోవడం వల్లే పెళ్లి చేసుకున్నారని ఆమె వెల్లడించారు. 2000 సంవత్సరంలో వివాహం చేసుకున్న ఈ జంట, మనస్పర్థల కారణంగా 2014లో పరస్పర అంగీకారంతో విడిపోయారు. ప్రస్తుతం సుసానే ఖాన్ ఆర్సలాన్ గోనీతో, హృతిక్ రోషన్ నటి సబా ఆజాద్తో రిలేషన్షిప్లో ఉంటూ తమ జీవితాల్లో సంతోషంగా ముందుకు సాగుతున్నారు. విడిపోయినప్పటికీ తమ పిల్లలు హృదాన్, హృహాన్ కోసం ఈ మాజీ జంట తరచూ కలుస్తూ, ఫ్యామిలీ ఫంక్షన్లలో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.