చెడుపై మంచి సాధించిన విజయ సంకేతమే విజయదశమి. శక్తి స్వరూపిణి అమ్మవారిని ఆరాధించడం ద్వారా తలపెట్టిన ప్రతీ కార్యం విజయ శిఖరాలను తాకుతుందనే భక్తుల నమ్మకం. పండుగ రోజు శమీ వృక్షాన్ని సందర్శిస్తే విజయమంత్రం వరిస్తుందని, పాలపిట్టను చూస్తే సకల పాప నాశనం అవుతుందని విశ్వసిస్తారు. పాండవులు అరణ్యవాసం చేసే సమయంలో తమ ఆయుధాలను శమీ వృక్షంపై ఉంచి యుద్ధసమయంలో వృక్షానికి పూజ చేసి యుద్ధంలో గెలిచారని పురాణాలు చెబుతున్నాయి.
వనపర్తి, అక్టోబర్ 14 : ఆశ్వీయుజ శుద్ధ పాఢ్యమి నుంచి మొదలై నవమి నాటికి తొమ్మిది రోజుల పాటు భక్తులు అమ్మ వారిని నిష్ఠగా పూజిస్తారు. పదో రోజు విజయదశమి పండుగను జరుపుకొంటారు. తొమ్మిది రోజులు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని రోజుకో అలంకరణలతో ఆరాధించిన తరువాత వచ్చే దశమి రోజున దసరా వేడుకలు జరుపుకొంటారు. ఈ ఏడాది శుక్రవారం పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. హిందువుల పండుగలన్నీ ప్రకృతి, పురాణగాథల ఆధారంగా ఉంటాయి. వీటిలో నైతిక విలువల ప్రబోధంతోపాటు భారతీయుల విలువలు, సంస్కృతి, సంప్రదాయాలను శాశ్వతం చేసే అంశం కూడా దాగి ఉంటుంది.
విజయ సంకేతమే విజయదశమి..
చెడుపై మంచి సాధించిన విజయ సంకేతమే విజయదశమి. దేవీ నవరాత్రుల్లో అత్యుగ్ర రూపం మహిషాసురుడు అనే రాక్షసుడిని అంతం చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తున్నది. శక్తి స్వరూపం, మహాశక్తి రూపంలో ఉన్న అమ్మవారిని ఆరాధిస్తే ప్రతీ కార్యం విజయ శిఖరాలను చేరుకుంటుందని ప్రజల నమ్మకం. శ్రీరాముడు అపరాజితా దేవిని పూజించాకే రావణ సంహారం చేసి విజయం సాధించాడని చరిత్ర చెబుతున్నది. అందుకే విజయదశమి రోజున రావణాసురుడి ప్ర తిమలు దహనం చేస్తారు. విజయదశమి రోజున ఏ వస్తువును కొనుగోలు చేసినా శుభప్రదంగా భా విస్తారు. దుకాణాలు, వ్యాపారాలు ప్రారంభిస్తే ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతుందని ప్రజల నమ్మకం. పాత యంత్రాలు, వాహనాలను సైతం శుభ్రపరిచి ప్రత్యేక పూజలు చేస్తారు. విజయదశమి రోజున సాయంత్రం నక్షత్ర దర్శన సమయంలో పాల పిట్టను దర్శించుకుంటే సకలపాపాలు తొలిగిపోతాయని ప్రజల విశ్వాసం.
శమీ దర్శనం.. విజయ మంత్రం..
విజయదశమి రోజున సాయంత్రం ప్రజలు మంగళవాయిద్యాలతో ఊరికి వెలుపల ఉన్న శమీ (జమ్మిచెట్టు) దర్శనం చేసుకుంటారు. జమ్మి ఆ కును బంగారంలా భావించి ఇచ్చి పుచ్చుకుంటా రు. తల్లిదండ్రులకు ఇచ్చి పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకుంటారు. యజ్ఞ యాగాదుల్లో సహజ సిద్ధంగా అగ్నిని పుట్టించేందుకు శమీ కొ య్యను ఉపయోగిస్తారు. పాండవులు విరటుని కొ లువుల్లో ఉంటూ శమీ వృక్షంపై తమ ఆయుధాలు దాచారని, అజ్ఞాతవాసం గడువు ముగియడంతో శమీచెట్టుపై ఉంచిన ఆయుధాలను తీసుకుని యు ద్ధం చేసి గెలిచారని మహాభారతం ద్వారా తెలుస్తున్నది. అందుకే శమీ వృక్షం దర్శనంతో తప్పక విజయం లభిస్తుందని, నాటి నుంచి శమీవృక్షానికి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. శమీ వృక్షానికి పూజలు చేస్తే సర్వపాపాలు తొలిగిపోయి శత్రునాశనం జరిగి విజయం చేకూరుతుందని ప్రజల నమ్మకం. చెడు నుంచి మంచి సాధించిన విజయానికి గుర్తుగా, కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు విజయం సాధించిన రోజు అని, రాముడు రావణాసురుడిని మట్టుబెట్టిన రోజు అని, భగీరథుడు గంగను దివి నుంచి భువికి దించిన రోజు అని, దేవి అత్యుగ్ర రూపం మహిషారుడు అనే రాక్షసుడిని అంతం చేసినట్లు అని పురాణాల్లో ఉండడంతో విజయదశమి పండుగ రోజుకు అంత ప్రాముఖ్యత ఉంది. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాల్లోనూ, ఇళ్లలోనూ ఆయుధ పూజ నిర్వహిస్తారు. వాహనాలను శుభ్రం చేసుకుని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. శమీ వృక్షానికి ఆయుధాలకు తుప్పు పట్టనివ్వని గుణం ఉంటుంది.
కాగా, దసరా పండుగ సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో ఓ విశిష్టత ఉంది. రాజుల కాలంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహానికి వారి వంశస్థులు తొమ్మిది రోజుల పాటు పూజలు చేస్తారు. ఆనాటి కాలంలో వినియోగించిన ఆయుధాలకు పూజలు చేయడం వనపర్తి రాజ వంశస్థులకు ఆనవాయితీ. నవరాత్రుల ఉత్సవాల అనంతరం పదో రోజు రాజా బంగ్లా నుంచి ఆనాటి అమ్మవారి విగ్రహాన్ని, ఆయుధాలను సంగీత వాయిద్యాలతో జిల్లా కేంద్రంలోని ప్రదాన రహదారుల మీదుగా ర్యాలీగా వెళ్లి శమీ వృక్షం వద్ద వేద పండితులు, ప్రజలతో కలిసి పూజలు చేస్తారు. జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటారు. కార్యక్రమానికి రాజ వంశస్థులతో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హాజరవుతారు.