సంస్థాన్ నారాయణపురం, జనవరి 20 : మండలంలోని గుడిమల్కాపురం గ్రామానికి చెందిన వీరమళ్ల కార్తీక్ గౌడ్ సమాజ సేవలో ముందుంటూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే బీసీ నాయకుడిగా బలహీన వర్గాల పక్షాన పోరాటాలు చేస్తున్నారు. అనాథలకు, నిరుపేదలకు అండగా నిలబడుతూ మరోవైపు నేత్రదానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కార్తీక్ తన ప్రస్థానాన్ని బీసీ యువజన సంఘంలో 2018లో ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ బీసీ యువజన సంఘం సంస్థాన్ నారాయణపురం మండలాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
నిస్సహాయులకు అండగా..
మండలంలోని మల్లారెడ్డిగూడెం, పుర్లకుంట, చిల్లపురం, గుజ్జ తదితర గ్రామాల్లో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు, తాటి చెట్టు పైనుంచి పడిన వ్యక్తి కుటుంబానికి తన వంతుగా సాయం అందిస్తూ అండగా నిలబడ్డారు. ఆయా కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేయడంతో పాటు ఆర్థిక సాయం చేశారు. తాటి చెట్టుపై నుంచి పడిన సుర శ్రీను కుటుంబానికి రూ.20 వేలతో పాటు ఆరు నెలల పాటు ప్రతి నెలా 25 కేజీల చొప్పున బియ్యం అందిస్తున్నారు. పలువురు చిన్నారుల చదువు బాధ్యత తీసుకుని గురుకులాల్లో సీటు లభించేలా కృషి చేశారు. పారిశుధ్య కార్మికులకు, జర్నలిస్టులకు మాస్క్లు, శానిటైజర్లు పంపిణీ చేశారు.
సేవలోనే సంతృప్తి
బీసీ వాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జరుగుతున్న పోరాటాల్లో క్రీయాశీలకంగా పాల్గొంటున్నా. ఇప్పటి వరకు 10 మంది అనాథ విద్యార్థులకు వివిధ గురుకులాల్లో సీట్లు ఇప్పించడం జరిగింది. నేత్రదానంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. నిరుపేద కుటుంబాలకు, అనాథ చిన్నారులకు చేతనైన సహాయం చేయడం సంతృప్తినిస్తుంది.