మియాపూర్: సరైన అనుమతులు లేకుండా బ్యూటీ పార్లర్ను నిర్వహిస్తున్నారంటూ విలేకర్ల పేరుతో పార్లర్ నిర్వహకులను బెదిరించిన కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. మియాపూర్ సీఐ వెంకటేశ్ సోమవారం తెలిపిన వివరాల ప్రకారం….
మియాపూర్లోని బీఎంఆర్ కాంప్లెక్స్లో రెవలాన్ బ్యూటీ ఫ్యామిలీ స్టూడియోను బుదుమూరి సుజాత అనే మహిళ నడిపిస్తున్నది. కాగా ఆదివారం సాయంత్రం 3.30 గంటల సమయంలో ఇద్దరు యువకులు మానిక్ (32) అమర్నాథ్ (33) లు తాము విలేకర్ల మంటూ( నమస్తే తెలంగాణ కాదు) పార్లర్లోకి వచ్చారు.
సరైన లైసెన్సు లేకుండా పార్లర్ నడుపుతున్నారని, తమకు నెలకు రూ. 30 వేలు ఇవ్వాలని లేని పక్షంలో ఈ విషయా న్ని పత్రికలో రాస్తామని బెదిరించారు. వారి డిమాండ్ను నిర్వహకురాలు ఆమోదించకపోవటంతో కనీసం రూ. 10 వేల యినా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారు విలేకరులు కాదని గుర్తించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేసినట్లు సీఐ తెలిపారు.