ధాన్యం కొనుగోళ్లకు కేంద్రం మోకాలొడ్డినా రైతు సంక్షేమమే ధ్యేయంగా చివరి గింజ వరకూ కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మహా సంకల్పంలో అన్ని శాఖలూ నిబద్ధతతో పనిచేయగా, ఒక్క ఆత్మకూర్.ఎస్ మండలం ముక్కుడుదేవులపల్లి, గట్టికల్లు కొనుగోలు కేంద్రాల్లో మాత్రం అక్రమాలు వెలుగుచూశాయి. వాస్తవానికి డిసెంబర్ 24నే ఇక్కడ కొనుగోళ్లు ముగిసినా, 30న రైతుల నుంచి ధాన్యం కొన్నట్లు రికార్డుల్లో చూపించి నకిలీ పేర్లతో రూ.85లక్షలు కొట్టేశారు. జిల్లా యంత్రాంగం ఆదిలోనే ఈ అక్రమాన్ని గుర్తించడంతో వెంటనే విచారణ
చేపట్టి పీఏసీఎస్ సీఈఓ లక్ష్మారెడ్డి, ట్యాబ్ ఆపరేటర్ గణేశ్, గట్టికల్ ఐకేపీ వీఓఏ దయాకర్, ట్యాబ్ ఆపరేటర్ సంపత్ను నిందితులుగా తేల్చింది. మంత్రి జగదీశ్రెడ్డి ఆదేశాల మేరకు అందరినీ సస్పెండ్ చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేసింది. నిందితులు కొట్టేసిన డబ్బును సైతం రికవరీ చేసింది.
సూర్యాపేట/ఆత్మకూర్ ఎస్, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : ఆత్మకూర్.ఎస్ మండలం ముక్కుడుదేవులపల్లి, గట్టికల్లు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరిగిన అక్రమాలను గుర్తించిన అధికారులు వెనువెంటనే స్పందించి వందశాతం రికవరీ చేశారు. ఇందుకు కారకులైన నలుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించడంతో పాటు సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ వినియ్కృష్ణారెడ్డి తెలిపారు. గతేడాది డిసెంబర్ 25 నాటికి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాగా అనంతరం జిల్లాలోని 285 సెంటర్ల రికార్డులను పరిశీలించే క్రమంలో ముక్కుడుదేవులపల్లి, గట్టికల్లు కొనుగోలు కేంద్రాలలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. దాంతో గత నెల 27న కలెక్టర్ పూర్తి విచారణకు ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయిన వెంటనే సంబంధిత రికార్డులను డీఆర్డీఏ, పీఏసీఎస్, పౌరసరఫరాల అధికారులు వారం రోజుల పాటు పర్యవేక్షించారు. ఆత్మకూర్.ఎస్ మండలం ముక్కుడుదేవులపల్లి పీఏసీఎస్, గట్టికల్లు ఐకేపీ సెంటర్ల పీపీసీలకు సంబంధించి రికార్డుల్లో వ్యత్యాసం గుర్తించారు. విషయాన్ని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశాలు జారీ చేశారు. విచారణ అనంతరం దాదాపు రూ.85 లక్షలు అవకతవకలకు పాల్పడినట్లు తేలింది. దాంతో పీఏసీఎస్ సీఈఓ లక్ష్మారెడ్డి, ట్యాబ్ ఆపరేటర్ గణేశ్తో పాటు గట్టికల్ ఐకేపీ వీఓఏ దయాకర్, ట్యాబ్ ఆపరేటర్ సంపత్లను విచారణ చేసి వందశాతం రికవరీ చేయడంతో పాటు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆదేశాల మేరకు వారిని సస్పెండ్ చేశారు.
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు : కలెక్టర్
ఐకేపీ, పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. గత నెల 25న వానకాలానికి సంబంధించి ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాగా రికార్డుల పరిశీలనలోనే ముక్కుడుదేవులపల్లి, గట్టికల్లు కేంద్రాల్లో అక్రమాలు గుర్తించి విచారణ చేశారు. శాఖా పరమైన చర్యలతో పాటు బ్యాంక్ ఖాతాల్లో జమ అయిన సొమ్మును రికవరీ చేశారు. రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆదేశాల మేరకు సంబంధిత వ్యక్తులపై ఆత్మకూర్.ఎస్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశాం. పోలీసులు సమగ్ర విచారణ చేపడుతున్నారు.