కొండాపూర్ : తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మెరుగైన సేవలనందిస్తుందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. బుధవారం మాదాపూర్లోని ఆవాస హోటల్లో నిర్వహించిన అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆర్జిన్ (ఆపీ) 15వ గ్లోబల్ హెల్త్ కేర్ సమ్మిట్లో వర్చువల్ విధానంలో పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణలో వైద్య సేవలు మెరుగ్గా ఉన్నాయని, నీతి అయోగ్లో తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో నిలిచిందన్నారు. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆర్జిన్ వైద్యులు విదేశాల్లో స్థిరపడిపోయినప్పటికీ మాతృ దేశానికి సేవ చేయాలనే గొప్ప సంకల్పంతో భారతదేశంలో వైద్య సేవలందించేందుకు ముందుకు రావడం హర్షణీయ మన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ పాండమిక్ నెలకొందని, దేశంలోనూ అలాంటి పరిస్థితులు ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గత రెండేండ్లుగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందుకు తగ్గట్టుగా దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆరోగ్యపర రక్షణ చర్యలు తీసుకుంటున్నాయన్నారు. ఇప్పటికే దేశంలో రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేసుకోవాల్సిందిగా తెలిపారు.
దేశ వ్యాప్తంగా దాదాపు మొదటి డోసు పూర్తైందని, రెండవ డోసు సైతం తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఆపీ సభ్యులు కొవిడ్ సమయంలో దేశానికి అవసరమైన సహకారం అందించారని, ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాలతో కోఆర్డినేట్ చేస్తూ కరోనా పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రానికో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుని, మెరుగైన ఆరోగ్యాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవల అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆపీ సభ్యులు ఈ ఏడాది ప్రత్యేక లక్ష్యంతో ముందుకు రావడం సంతోషంగా ఉందని, దేశంలోని 75 గ్రామాలను దత్తత తీసుకుని మెరుగైన ఆరోగ్యాన్ని అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకలలోని 75 గ్రామాలను ఎంపిక చేసుకున్నట్లు ఆపీ అధ్యక్షులు అనుపమ గొటిముకల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆపీ సభ్యులు డాక్టర్ సతీష్ కత్తుల, డాక్టర్ కిషన్ కుమార్, డాక్టర్ ఉదయ్ శివంగి, డాక్టర్ సుజిత్ పున్నం, డాక్టర్ ద్వారకానాథ్రెడ్డి, డాక్టర్ రవికోహ్లీ తదితరులు పాల్గొన్నారు.