తిరుమలగిరి, అక్టోబర్ 16 : సమైక్య పాలనలో సాగునీరు కరువై సూర్యాపేట, తుంగతుర్తి నియోజక వర్గాల రైతులు వ్యవసాయం వదిలి వలస బాటలు పట్టేవారు. వానకాలం సాగు సైతం కత్తి మీద సాములా ఉండేది. కానీ, నేడు అలాంటి ప్రాంతంలో రైతులు సిరులు పండిస్తున్నారు. కరువు భూముల్లోకి జల సిరులు చేరడంతో కల్లాలు ధాన్యం రాశులతో కళకళలాడుతున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తూ అన్నదాతకు అండగా నిలిచారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవడంతో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా సాగునీరు అందించారు. ఆరుగాలం కష్టించే అన్నదాతలకు పెట్టుబడి కష్టాలు తీర్చుతూ రైతుబంధు, రైతుబీమా, నిరంతర విద్యుత్ సరఫరాతో సూర్యాపేట జిల్లాలో ధాన్యం సిరులు పండుతున్నాయి. గతేడాది వేసవిలోనూ ఎస్సారెస్సీ కాల్వలకు నీటిని విడుదల చేయడంతో చెరువులు, కుంటలు నిండాయి. దీంతో 300 ఫీట్లలోతులో ఉన్న భూగర్భ జలాలు 30 నుంచి 40 ఫీట్లపైకి చేరాయి. బోర్లలో పుష్కలంగా నీరుండడం, నిరంతర విద్యుత్ సరఫరా చేయడంతో జిల్లా వ్యాప్తంగా 39 వేల ఎకరాల్లో రైతులు ఎడగారు (కత్తెర) వరి సాగు చేశారు. వాతావరణం సహకరించడంతో పంట భారీగా పండింది. తిరుమలగిరి, సూర్యాపేట మార్కెట్కు ఈ సీజన్లో ఇప్పటి వరకు 1,58,122 బస్తాల వరి ధాన్యం వచ్చింది.
యాసంగిని తలపించిన ఎడగారు సాగు
రెండేండ్లుగా జిల్లాలో ఎడగారు సాగు బాగా పెరిగింది. మిషన్ కాకతీయ పథకం పుణ్యమాని చెరువుల్లో పుష్కలంగా నీరు చేరడం రాష్ట్ర ప్రభుత్వం సాగునీరు అందిస్తుండడంతో ఉగాది వెళ్లగానే రైతులు నారు పోసి మండే ఎండల్లోనూ వరిసాగు చేపట్టారు. ఇప్పటి వరకు వ్యవసాయాధికారులు వానకాలం, యాసంగి సాగు విస్త్రీర్ణాన్ని మాత్రమే లెక్కలు వేసేవారు. ఇక నుంచి ఎడగారు (కత్తెర)సాగు విస్త్రీర్ణం సైతం రికార్డుల్లోకి ఎక్కనుంది.
మార్కెట్లకు పోటెత్తుతున్న ధాన్యం
తిరుమలగిరి, సూర్యాపేట ,హుజూర్నగర్, కోదాడలో వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. తిరుమలగిరి, సూర్యాపేట మార్కెట్లకు గత 40 రోజులుగా వరి ధాన్యం వస్తున్నది. సాగర్ ఆయకట్టులో కత్తెరలో వరిసాగు చేయకపోవడంతో హుజూర్నగర్, కోదాడ మార్కెట్లకు ధాన్యం రావడం లేదు. తిరుమలగిరి మార్కెట్కు 2019లో 14 వేల బస్తాల ధాన్యం వస్తే , 2020లో లక్షా 937 బస్తాలు వచ్చింది. 2021లో ఇప్పటి వరకు 1,10,957 బస్తాలు రాగా.. మరో 30 నుంచి 40 వేల బస్తాలు వచ్చే అవకాశం ఉంది. సూర్యాపేట మార్కెట్కు 2019లో సుమారు 3200 బస్తాల ధాన్యం వస్తే 2020లో 1,72,656 బస్తాలు వచ్చింది. 2021లో ఇప్పటి వరకు 47165 బస్తాలు వచ్చింది. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.1,960 కాగా సాధారణ ధర రూ.1940 ఉంది.
రైతులకు మంచి రోజులు వచ్చినయ్
తెలంగాణ ఏర్పడ్డాక రైతులకు మంచిరోజులు వచ్చినయ్. గతంలో వానకాలంలోనూ సాగునీరందక వరిసాగు పక్కన పెట్టినం. నీళ్లు లేక భూములు, కంచెలు బీడుగా మారియనయి. సాగు చేయలేక కొందరు రైతులు తోటలు పెట్టుకున్నరు. కాలం మారింది. తోటలు, బీడు భూములకు కూడా పుష్కలంగా నీరొస్తున్నది. నాకున్న రెండెరాల్లో ఎడగారు సాగు చేసిన. 120 బస్తాల దిగుబడి వచ్చేట్టుంది.
నాణ్యమైన ధాన్యం తేవాలి..
రైతులు నాణ్యమైన ధాన్యాన్ని మార్కెట్కు తెచ్చి ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర పొందాలి. ఆరుగాలం కష్టపడి పండించి నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే ధర కోల్పోతారు. ధాన్యాన్ని ఆరబెట్టి, తూర్పార బట్టి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
2015 నుంచి 2021-22
వరకు ధాన్యం మద్దతు ధర
సంవత్సరం మద్దతు ధర(క్వింటాకు)
2015-16లో రూ. 1450
2016-17లో రూ. 1510
2017-18లో రూ. 1590
2018-19లో రూ. 1770
2019-20లో రూ. 1835
2020-21లో రూ. 1888
2021-22కు రూ. 1960గా మద్దతు ధర
పెరుగుతూ వచ్చింది.