Sridevi | దండేపల్లి, ఏప్రిల్ 16 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని నెల్కివెంకటాపూర్ గ్రామానికి చెందిన మహిళా రైతు సిద్ధం శ్రీదేవి మల్చింగ్ (ప్లాస్టిక్ షీటుతో మొక్క చుట్టూరా కప్పి ఉంచడం) విధానంలో కూరగాయలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది. ముంబై యూనివర్సిటీలో ఎంకామ్ చదివి, ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగం చేసినా సంతృప్తిని ఇవ్వలేదు. నలుగురికి ఉపాధి కల్పించాలని, ప్రజలకు ఆరోగ్యమైన కూరగాయలు అందించాలనే తన ఆశయాన్ని భర్త శ్రీనివాస్కు తెలియజేసింది. మంచి ఆలోచన కావడంతో నర్సాపూర్ శివారులో తమకున్న ఐదెకరాల వ్యవసాయ భూమిలో కూరగాయలు పండించడం మొదలు పెట్టారు. అంతకముందు వరి సాగు చేసినా.. ప్రస్తుతం బీర, టమాట, గోడు చిక్కుడు, వంకాయ, కాకర, సోర కాయలను కాలానుగుణంగా పండిస్తున్నారు. కూరగాయలతోపాటు ఎనిమిది ఆవులు కొనుగోలు చేసి గోమూత్రం, పేడతో సేంద్రియ ఎరువులు తయారు చేసి వినియోగిస్తున్నారు. రసాయనిక ఎరువులు వాడకపోవడం, ఆధునిక, సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులు పాటిస్తుండడంతో చుట్టూ పక్కల వారు కూడా వీరు పండించిన కూరగాయలపై ఆసక్తి చూపుతున్నారు. పండించిన కూరగాయలను మంచిర్యాల, కరీంనగర్ లాంటి పట్టణ ప్రాంతాలతోపాటు లక్షెట్టిపేట, ముత్యంపేట, దండేపల్లి, మేదరిపేట, తాళ్లపేట, జన్నారంలో చిరు వ్యాపారులకు విక్రయిన్నారు. గతేడాది రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టగా.. రూ.6 లక్షల ఆదాయం వచ్చిందని శ్రీదేవి తెలిపారు.
మొక్కల చుట్టూ ఉండే వేర్ల భాగాన్ని ఏవేని పదార్థాలతో కప్పడాన్ని మల్చింగ్ అంటారు. ఈ పద్ధతికి వరి, రంపపు పొట్టు, చెరుకు పిప్పి, ఎండిన ఆకులు, చిన్నచిన్న గులకరాళ్లు మొదలైనవి వాడుతారు. కానీ.. వీటి లభ్యత తగ్గుతున్నందున ప్లాస్టిక్ షీట్తో మల్చింగ్ వేయడం ప్రస్తుతం ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నది. ప్లాస్టిక్ షీటుతో మొక్క చుట్టూరా కప్పుతుండడంతో దీన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అంటారు. ఈ విధానంతో మొక్క చుట్టూ తేమను ఆవిరి కాకుండా నివారించవచ్చు.
మల్చింగ్ విధానంలో కూరగాయలు సాగు చేయడం వల్ల కలుపు సమస్య ఉండదు. కూలీల ఖర్చు తగ్గుతుంది. నీరు ఆదా అవడంతోపాటు, ఎరువుల ఖర్చు కూడా తగ్గుతుంది. రసాయనిక ఎరువుల జోలికి వెళ్లకుండా సేంద్రియ ఎరువులతోనే పంటలు పండిస్తున్నాం. వ్యవసాయాధికారుల సూచనలు, భర్త ప్రోత్సాహంతో ముందుకు వెళ్తున్నా. ముఖ్యంగా చదువుకున్న యువత వ్యవసాయ రంగంలోకి రావాలి.
-సిద్ధం శ్రీదేవి, మహిళా రైతు.