కరోనా మహమ్మారిని నిర్మూలించడమే లక్ష్యంగా పద్దెనిమిది ఏండ్లు పైబడిన వారందరికీ ప్రభుత్వం టీకాలు వేస్తున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో గురువారం స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ను ప్రారంభించింది. టీకా కేంద్రాలకు జనం భారీగా వచ్చి వ్యాక్సిన్ వేయించుకున్నారు. అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకా పంపిణీని పర్యవేక్షించారు. అధికారులు అవగాహన కల్పిస్తుండడంతో ప్రజలు అపోహలు వీడి వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు. మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 2.04 లక్షల మందికి మొదటి డోస్, 75.545 మందికి రెండో డోస్ పూర్తయ్యింది. సంగారెడ్డి జిల్లాలో మొదటి, రెండో డోస్ కలిపి 5,75,444 మందికి టీకా వేశారు. సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు రెండు డోస్లు కలిపి 4,81,023 మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది.
సిద్దిపేట/మెదక్, సెప్టెంబర్ 16 : సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరికీ వందశాతం కొవిడ్ వ్యాక్సిన్ వేయాలని, సీజనల్ వ్యాధుల నియంత్రణకు స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపడుదామని మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, నారాయణరావుపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కౌన్సిలర్లతో మొత్తం 224 మందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికీ కొవిడ్ టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, వ్యాక్సిన్ల కొరత లేదని వందశాతం వ్యాక్సినేషన్ జరిగితే ఇబ్బందులు ఉండవన్నారు. ప్రతి గ్రామంలో 18 ఏండ్లు నిండిన వారందరూ వ్యాక్సిన్ వేసుకునేలా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదేనని ఆయన సూచించారు. ఆయా వార్డుల్లో, గ్రామ, పట్టణ పరిధిలోని అర్బన్ హెల్త్ సెంటర్లు, ఏఎన్ఎం లు, ఆశవర్కర్లు, అంగన్వాడీ, ఆరోగ్య సిబ్బందితో పాటు మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, కమిషనర్, స్థానిక ప్రజాప్రతినిధులు సమావేశాలు నిర్వహించి సమన్వయంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను ముందుకు తీసుకుపోవాలన్నారు. గతవారం నుంచి డెంగీ, మలేరియా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని, వాటి ని అరికట్టేలా వాటర్ ట్యాంకులు, డ్రైనేజీలు పరిశుభ్రంగా ఉండేలా పటిష్ట చర్యలు చేపట్టి, ఫాగిం గ్ చేయాలని మంత్రి సూచించారు.
కలెక్టర్ల టెలీకాన్ఫరెన్స్లో సీఎస్..
వందశాతం కరోనా వ్యాక్సినేషన్ జరిగేలా ప్రణాళికలు రూపొందించుకొని టీకా కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిందిగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కలెక్టర్లకు సూచించారు. గురువారం హైదరాబాద్ నుం చి కలెక్టర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని ఆవాస ప్రాం తాలు, పట్టణ ప్రాంతాల్లో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా టీకా తీసుకునేలా చూడాలన్నారు.
టీకాతో రోగనిరోధక శక్తి ..
మెదక్ కలెక్టర్ హరీశ్ అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ వ్యాక్సిన్ రామబాణం లాంటిదని, ఎలాంటి జబ్బులున్నా వ్యాక్సిన్ తీసుకోవచ్చని, భయాందోళనలు, అపోహలు వద్దని, టీకా తీసుకుంటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, కరోనా వచ్చినా.. ప్రమాదకరం కాదన్న విషయంపై ప్రజల్లో అవగాహన కలిగించి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలన్నారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా జిల్లాలో వంద శాతం కరోనా వ్యాక్సి న్ పూర్తి చేయడమే లక్ష్యంగా గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు భాగస్వాములై పనిచేయాలని కోరారు. వ్యాక్సినేషన్ వేసిన వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావుకు కలెక్టర్ సూచించారు.
త్వరగా పూర్తి చేయాలి : జడ్పీ చైర్పర్సన్
అందోల్, సెప్టెంబర్ 16: కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అన్నారు. గురువారం డాకూర్లో ఏర్పాటుచేసిన కొవిడ్-19 స్పెషల్ డ్రైవ్ క్యాంప్ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందజేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ను ఏర్పాటు చేసిందని చెప్పారు. ఆమె వెంట ఎంపీపీ బాలయ్య, ఎంపీడీవో సత్యనారాయణ, సర్పంచ్ పూజ ఉన్నారు.