చిన్న జిల్లాల ఏర్పాటుతో అన్నివర్గాల ప్రజలకు నేరుగా సంక్షేమ ఫలాలు చేరువవుతున్నాయి… ఐదేండ్ల కాలంలో అద్భుతమైన ఫలితాలు సాధించుకోగలిగాం. ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నప్పుడు మెతుకు సీమ నిరాధరణకు గురైంది. సీఎం కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకుని నూతన జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు ఏర్పడిన కొత్త జిల్లాలు ఇప్పుడు ప్రజాకాంక్షలకు ప్రతిబింబంగా మారుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజల దరికి చేరుతున్నాయి. కోటి ఎకరాలకు సాగునీరందించాలనే సంకల్పంతో తలపెట్టిన కాళేశ్వరంతో పాటు పలు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయ్యింది. దీంతో జలవనరులన్నీ నిండుకుండల్లా మారాయి. రైతన్నలు సంతోషంగా ఎవుసం చేసుకుంటున్నారు. విద్య, వైద్య రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాం. నూతనంగా దవాఖానలు, పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసుకున్నాం. కొత్త జిల్లాలు, మండలాలు, నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ పాలన కొనసాగుతున్నది. సర్కారు పాలనపై సబ్బండ వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నూతన జిల్లాలు ఏర్పాటై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మెదక్, సిద్దిపేట, అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక కథనం..
సంగారెడ్డి సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లా ఉనికిలోకి వచ్చి ఐదేండ్లు పూర్తయ్యింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, మెదక్ పేరిట టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. సిద్దిపేట, మెదక్ జిల్లా లు విడిపోడడంతో 11 అక్టోబర్, 2016 నుంచి సంగారెడ్డి జిల్లా ఉనికిలోకి వచ్చిం ది. జిల్లాలో సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గాలతోపాటు 27మండలా లు ఉన్నాయి. ప్రభుత్వం కొత్తగా అమీన్పూర్, కంది, మొగుడంపల్లి, వట్పల్లి, నాగల్గిద్ద, చౌటకూరు మండలాలను ఏర్పాటు చేసింది. 4996 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సంగారెడ్డి జిల్లా లో 657 పంచాయతీలు 14,95,503 మంది జనాభా ఉన్నారు. సంగారెడ్డి జిల్లా ఏర్పాటుతో ప్రభుత్వ పాలన ప్రజలకు చేరువైంది. సంగారెడ్డి జిల్లా ఏర్పాటుతో జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నది.
నెరవేరిన సంగారెడ్డి ప్రజల కల
సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సంగారెడ్డి జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాలను మం జూరు చేశారు. దీంతో జిల్లా ప్రజల చిరకాల కల నెరవేరింది. సుమారు రూ. 500కోట్ల నిధులతో సంగారెడ్డిలో ప్రభు త్వ వైద్యకళాశాల ఏర్పాటు కానున్నది. 150 సీట్లతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్నా యి. 300 పడకలతో కొత్త వైద్య బోధనా దవాఖాన ఏర్పాటు కానుంది.
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు
సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లా రైతాం గం కలను సైతం నెరవేరుస్తున్నారు. సిం గూరు బ్యాక్వాటర్ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోసి 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను ప్రకటించారు. ప్రభుత్వం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోల పథకాల నిర్మాణానికి రూ.4474 కోట్ల నిధులను కేటాయించింది. అలాగే పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. దీంతో త్వరలోనే టెండర్లు ఆహ్వానించి నిర్మాణం పనులు చేపట్టనున్నారు.
సీఎం కేసీఆర్ మార్గదర్శనం, ఆర్థిక మంత్రి హరీశ్రావు పర్యవేక్షణలో సంగారెడ్డి జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వం జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు పెద్దపీట వేస్తున్నది. జిల్లాలో ఇప్పటి వరకు 175.18 కోట్లతో 2,355 రెండు పడకల గృహాలను నిర్మించారు. ఐడీఏ పాశమైలారం ఇండస్ట్రీయల్ పార్కు నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.45 కోట్లు విడుదల చేసింది. జిల్లాలోని రహదారుల మరమ్మతు పనులకు రూ.25.83 కోట్లు, 29 బ్రిడ్జిల నిర్మాణానికి రూ.73.64 కోట్లను మంజూరు చేసింది. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి కలిపే రహదారుల నిర్మాణ పనులు రూ.58.89 కోట్లతో పూర్తయ్యాయి. టీఎస్ఐపాస్ ద్వారా జిల్లాలో 671 పరిశ్రమలకు అనుమతులు మంజూరయ్యాయి. నిమ్జ్లో రూ.2500 కోట్లతో ట్రైటాన్ సంస్థ పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నది. సంగారెడ్డి జిల్లాలో ఇటీవల రూ.5587 కోట్ల పెట్టుబడితో 460 పరిశ్రమలు స్థాపించి 26,605 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. సేవా రంగానికి సంబంధించి రూ.29.87కోట్ల రాయితీతో 101 యూనిట్లను ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో రూ.38.50 కోట్లతో వెజ్నాన్వెజ్ మార్కె ట్లు నిర్మిస్తున్నారు. రూ.10.25 కోట్లతో మున్సిపాలిటీల్లో వైకుంఠధామాల నిర్మాణ పనులు సాగుతున్నాయి.
మెదక్ జిల్లా కేంద్రం ఏర్పాటుతో అన్ని హంగులు
మెదక్, అక్టోబర్ 10 : గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాగా ఉన్న మెదక్ జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత మెదక్లోనే కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలతో పాటు ఇతర జిల్లా స్థాయి అధికారుల కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. మెదక్ జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఉన్నాయి. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలు ఉండగా, గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న తూప్రాన్, మనోహరాబాద్ మండలాలు మెదక్ జిల్లాలో ఉన్నాయి. రేగోడ్, టేక్మాల్, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం మండలాలు ఆందోల్ నియోజకవర్గంతో పాటు నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉన్నాయి. మెదక్ జిల్లా ఏర్పాటుతో అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. కలెక్టరేట్ కార్యాలయం నిర్మాణం తుది దశలో ఉండగా, ఎస్సీ కార్యాలయం నిర్మాణ దిశలో ఉన్నది. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో అర్బన్ పార్కు ఏర్పాటు కావడంతో పర్యాటకులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. పోచారం అభయారణ్యం పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్నది. గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న తూప్రాన్, మనోహరాబాద్ మండలాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నాయి.
మెదక్ జిల్లాలో కొత్తగా ఆరు మండలాలు ఏర్పాటు
మెదక్ జిల్లాగా ఏర్పడిన తర్వాత జిల్లాలో ఆరు కొత్త మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో హవేళీఘణాపూర్, నిజాంపేట, నార్సింగి, మాసాయిపేట, మనోహరాబాద్, చిలిపిచెడ్ మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి.
గజ్వేల్లో అద్భుత ప్రగతి
గజ్వేల్, అక్టోబర్ 10 : గజ్వేల్ జిల్లా కేంద్రానికి 80 కిలో మీటర్ల దూరం ఉండేది. జిల్లా కేంద్రం సంగారెడ్డికి వెళ్లాలంటే ఇబ్బందులు పడేవారు. జిల్లాల ఏర్పాటుతో దూరభారం తగ్గడంతో పాటు ఎన్నో సౌకర్యాలు గజ్వేల్ ప్రాంత వాసులకు వచ్చాయి. జిల్లా స్థాయిలో కలెక్టర్ తదితర అధికారులతో పనులు ఉంటే గంటలో సిద్దిపేట జిల్లా కేంద్రానికి చేరుకోవడమే కాకుండా వెంటనే పూర్తవుతున్నాయి. భూ సమస్యల పరిష్కారానికి గతంలో సిద్దిపేటలోని ఆర్డీవో కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు గజ్వేల్ రెవెన్యూ డివిజన్గా ఏర్పడడంతో మరింత సదుపాయంగా మారింది. గజ్వేల్ పరిపాలన కోసం ఆర్డీవో, ఏసీపీ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో జిల్లా స్థాయి దవాఖానను గజ్వేల్లో ఏర్పాటు చేశారు. ఉపాధిహామీ పథకం ఏపీడీ, జిల్లా బీసీ, ఎస్సీ తదితర సంక్షేమ శాఖల అధికారుల కార్యాలయాలను కూడా గజ్వేల్ ఐవోసీ భవన సముదాయంలో ఏర్పాటు చేశారు. జిల్లాకు తలమానికంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్తో పాటు ముంపుగ్రామాల ప్రజల కోసం నిర్మించిన ఆర్అండ్ఆర్ కాలనీలు రాష్ట్రవ్యాప్తంగా గజ్వేల్ ప్రతిష్టను మరింత పెంచాయి.
దూరభారం తప్పింది
సిద్దిపేట జిల్లా ఏర్పాటుతో ప్రజలకు అన్నీ అందుబాటులోకి వచ్చాయి. అప్పట్లో మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్లు. సీఎం కేసీఆర్ చిన్న జిల్లా లను ఏర్పాటు చేశారు. చిన్న జిల్లాల ఏర్పాటు తోనే అభివృద్ధి వేగంగా జరిగే అవకాశం ఏర్పడింది. ప్రజలంతా సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారు.
వంటేరు ప్రతాప్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్
కొత్త మండలాల ఏర్పాటుతో ప్రజల కల సాకారం
నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట, చిలిపిచెడ్ కొత్త మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాల పునర్విభజన అనంతరం నర్సాపూర్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందింది. నాలుగు లేన్ల రోడ్డు నిర్మించడంతో ప్రయాణం సులభతరమైంది. నర్సాపూర్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న బస్డిపో పనులు చివరి దశకు చేరుకుంది.
-చిలుముల మదన్రెడ్డి, ఎమ్మెల్యే, నర్సాపూర్
ప్రజల ముంగిట్లోకి ప్రభుత్వ కార్యాలయాలు
ప్రజలకు మెరుగైన పాలనను అందించాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేసింది. వట్పల్లి మండలం ఏర్పడిన తర్వాత అన్నిరం గాల్లో ఎంతో అభివృద్ధి సాధించింది. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో అందోల్- జోగిపేటను రెవెన్యూ డివిజన్గా, చౌటకూర్ను కొత్త మండలంగా ఏర్పాటు చేయడం జరిగింది.
-చంటి క్రాంతికిరణ్, అందోల్, ఎమ్మెల్యే