మెహిదీపట్నం : చారిత్రక కట్టడాల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. లంగర్హౌస్ బాపూఘాట్లో పునరుద్ధరించిన పురాతన బావిని సోమవారం రాత్రి మంత్రి కేటీఆర్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ,కార్వాన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్లతో కలిసి ప్రారంభించారు.
బావిలో రెండు తాబేళ్లను వదిలిన మంత్రి కేటీఆర్ చారిత్రక కట్టడాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అనంతరం బాపూఘాట్లో ఏర్పాటు చేసిన నగరంలో పలు ప్రాంతాలలో అభివృద్ధి చేసిన, పరిరక్షించిన బావులు, కట్టడాలకు సంబంధించిన చిత్ర ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు.
కొద్ది సేపు ఖవ్వాలి కార్యక్రమాన్ని ఆస్వాదించిన మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ శ్రేణులతో సెల్ఫీలు దిగారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ జోనల్ కమీషనర్ రవికిరణ్, డిప్యూటీ కమీషనర్ వి,నర్సింహా, కార్వాన్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇంఛార్జి ఠాకూర్ జీవన్సింగ్,నాయకులు శేఖర్ రెడ్డి,గోవింద్రాజ్,చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.