జగిత్యాల, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ): కేరళలో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి అక్కడి ప్రభు త్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను అధ్యయ నం చేసేందుకు వెళ్లిన ఆరుగురు సభ్యుల తెలంగాణ బృందం గురువారం తిరువనంతపురంలోని నోర్కా రూట్స్ కార్యాలయాన్ని సందర్శించింది. నాన్ రెసిడెంట్స్ కేరలైట్స్ అఫైర్స్ (నోర్కా రూట్స్) రిక్రూట్మెంట్ అధికారి అజిత్ కొల్లాస్సెరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నోర్కా సంస్థ కా ర్యకలాపాలను వివరించారు. బృందం సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానానమిచ్చారు. కేరళలోని సెంటర్ ఫర్ ఇండియన్ మైగ్రేంట్ స్టడీస్ (సిమ్స్) సంస్థ ప్రతినిధులు రఫీక్ రవుతర్, అఖిల్ శంకర్, పార్వతీ దేవి, సీనియర్ జర్నలిస్ట్ రిజిమోన్ కుట్టప్పన్లు ఈ పర్యటనకు సంధానకర్తలుగా వ్య వహరించారు. గల్ఫ్ జేఏసీ బృందంలో గుగ్గిళ్ల రవిగౌడ్ (జగిత్యాల జిల్లా), స్వదేశ్ పరికిపండ్ల (నిర్మ ల్ జిల్లా, నంగి దేవేందర్ రెడ్డి (మహబూబ్నగర్ జిల్లా), పెరుగు మల్లిఖార్జున్ (మంచిర్యాల జిల్లా), జలిగం కుమార స్వామి (సిద్దిపేట జిల్లా), గంగుల మురళీధర్ రెడ్డి (సంగారెడ్డి జిల్లా) ఉన్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని ఇటీవలి బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ గల్ఫ్ ప్రవాసీ సంఘాల ప్రతినిధులు పర్యటనకు వెళ్లినట్లు గల్ఫ్ జేఏసీ కన్వీనర్ గుగ్గిళ్ల రవిగౌడ్ తెలిపారు. గల్ఫ్ నుంచి వాపస్ వచ్చిన వలస కార్మికుల పునరావా స కార్యక్రమాల అమలును పరిశీలిస్తామని, కేరళ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను స్వయంగా పరిశీలించి ఒక నివేదికను తయారు చేసి తెలంగాణ ప్రభుత్వానికి సమర్పిస్తామని నంగి దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు.