కమాన్చౌరస్తా, ఏప్రిల్ 11: జిల్లా కేంద్రానికి చెందిన పద్మశ్రీ భాష్యం విజయసారథి ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఆదివారం అప్పాజోస్యుల విష్ణుబొట్ల కందాళం ఫౌండేషన్, శ్రీకళానికేతన్-మహతి క్రియేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, అఖిల భారతీయ సాహిత్య పరిషత్ జాతీయ అధ్యక్షుడు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాలయం ప్రతినిధి డాక్టర్ కంభంపాటి సాంబశివమూర్తి, వరంగల్కు చెందిన సాహితీ వేత్త గన్నమరాజు గిరిజామనోహర్ బాబు, నిర్వాహకులు అప్పాజోస్యుల సత్యనారాయణ, డీఎస్ఎన్ మూర్తి, రామకోటేశ్వర్ రావు పురస్కారంతో పాటు రూ. లక్ష నగదు భాష్యం విజయసారథికి అందజేశారు. అంతకుముందు ఆయన సాహిత్య జీవితంపై సమాలోచనలో భాగంగా సంస్కృత అకాడమీ సంచాలకుడు ఆచార్య నీలకంఠం అధ్యక్షతన సాహితీవేత్తలు డాక్టర్ దీవి నర్సింహ దీక్షితులు, డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, డాక్టర్ కే కోదండరామాచార్యులు, డాక్టర్ రంగాచార్యులు, నారుమంచి అనంతకృష్ణ, డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ కే వరలక్ష్మి, డాక్టర్ ఆంజనేయులు మాట్లాడారు. ఈ సందర్భంగా విజయసారథికి జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, కవులు, రచయితలు, పండితులు శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి