రేవల్లి, జనవరి 21 : మండలంలోని గౌరిదేవిపల్లి గ్రామ సమీపంలోని ఎంజీకేఎల్ఐ లిఫ్ట్-3 సిస్టర్న్ వద్ద ఆత్మహత్య చేసుకున్న బావామరదళ్ల మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతున్నది. వారి ప్రేమను ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదని మనస్థాపంతో సూసైడ్ నోట్ రాసి నాగర్కర్నూల్కు చెందిన నరేశ్కుమార్, కల్వకుర్తికి చెందిన కళ్యాణి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి వరకు మృతదేహాల కోసం వెతికినా లాభం లేకపోవడంతో శుక్రవారం కూడా గాలింపు ముమ్మరం చేశారు. ఇరిగేషన్, అగ్నిమాపక, రెవెన్యూ, మత్స్య, పొలీస్ శాఖ ఆధ్వర్యంలో గుడిపల్లి రిజర్వాయర్లో నాటు పడవల సాయంతో వెతికినా ఆచూకీ లభించలేదు. రిజర్వాయర్ నుంచి అచ్చంపేట, కల్వకుర్తికి సాగునీటిని తీసుకెళ్లే కాలువల వెంట అధికారులు గాలించారు. అయితే ఆత్మహత్య చేసుకున్న పంపి ంగ్ సిస్టర్న్ ప్రాంతంలో 10 ఫీట్లలోతులోని నీటి సంప్ లో ఉండొచ్చనే అనుమానంతో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. అయితే సంపులో ఉన్న లోహపు కడ్డీల్లో మృతదేహాలు ఇరుక్కున్నాయేమో అని గజ ఈతగాళ్ల సాయంతో వెతికించారు. పొద్దుపొయే వరకు ఆచూకీ తెలియకపోవడంతో మోటర్ల సాయంతో నీటిని బయటకు తోడే పనిలో అధికారులు మొదలుపెట్టారు. రాత్రి పొద్దుపోయే వరకు కేవలం 3 ఫీట్ల నీటిని మాత్రమే తోడివేయడంతో ఈ ప్రయాస వృథా అని భావించారు. బీచుపల్లి సమీపంలో కొండపేట గజ ఈతగాళ్లను రప్పించి వెతికించేందుకు సిద్ధమయ్యారు. ఫిషరీస్ జిల్లా అధికారి మహ్మద్ రహ్మాన్, తాసిల్దార్ శ్రీరాములు, నాగర్కర్నూల్ ఫైర్ సిబ్బంది, ఇతర అధికారులు గాలింపు చర్యలను పర్యవేక్షించారు.