నిజామాబాద్సిటీ, జనవరి 17 : హరితహారం, దళితబంధు కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్ సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎనిమిదో విడుత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు అంకితభావం, చిత్తశుద్ధితో కృషి చేయాలని, గతంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఒకింత వెనుకంజలో ఉండిపోయామని అన్నారు. ఈసారి అలసత్వానికి తావు లేకుండా మొక్కలను నాటేందుకు స్పష్టమైన కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
గ్రామపంచాయతీ వారీగా ఆయా శాఖల అధికారులందరికీ హరితహారం మొక్కల పెంపకం, వాటి సంరక్షణ చర్యలపై స్పష్టమైన అవగాహన ఉండాలని, గ్రామపంచాయతీ, అటవీశాఖ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీలు, రోడ్లు, భవనాలు, నేషనల్ హైవే అథారిటీ క్రియాశీల పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. దళితబంధు కార్యక్రమంలో భాగంగా మినీ డెయిరీ, పందిరి కూరగాయల సాగు, వేప నూనె, టెంట్హౌస్, ఆటోరిక్షా, శానిటరీ షాపులు, సిమెంట్, ఇటుక తయారీ తదితర యూనిట్లను జిల్లాలో ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని, ఈ కార్యక్రమం ద్వారా శాశ్వత ప్రాతిపదికన ఉపాధి కల్పించవచ్చన్నారు. జిల్లా అధికారులు అంకితభావంతో దళితబంధును అమలుచేసి విజయవంతం చేసేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
‘ప్రజావాణి’ ఫిర్యాదులను పరిష్కరించాలి
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను ఆయా శాఖల జిల్లా అధికారులు పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ నారాయణరెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రగతిభవన్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుంచి కలెక్టర్ నారాయణరెడ్డి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 52 ఫిర్యాదులు అందగా, వాటిని పరిశీలించిన కలెక్టర్ బాధితుల సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ మకరంద్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
క్యాలెండర్ ఆవిష్కరణ
ఖలీల్వాడి, జనవరి 17 : స్నేహ సొసైటీ క్యాలెండర్ను కలెక్టరేట్లోని ప్రగతిభవన్లో కలెక్టర్ నారాయణరెడ్డి సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి తదితరులు పాల్గ్గొన్నారు.