ఉస్మానియా యూనివర్సిటీ : తార్నాక డివిజన్ నాగార్జున నగర్ కాలనీలో పార్కు స్థలంలో ఆక్రమణలను, అక్రమంగా నిర్మించిన కట్టడాలను జీహెచ్ఎంసీ అధికారులు బుధవారం తొలగించారు. ఈ స్థలంపై సుదీర్ఘకాలంగా న్యాయస్థానాల్లో విచారణ కొనసాగింది.
చివరికి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ నేతృత్వంలోనే ధర్మాసనం ఆ స్థలాన్ని కాలనీ పార్కు స్థలంగా నిర్ధారిస్తూ ఇటీవలే తీర్పు వెలువరించింది. అక్కడి ఆక్రమణలను తొలగించడంతో పాటు, స్థల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది.
ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు జేసీబీలతో ఆక్రమణలను తొలగింపజేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆ స్థలం పార్కుకు చెందిందని సూచికను ఏర్పాటు చేశారు.
త్వరలోనే ఆ స్థలం పరిరక్షణకు ప్రహారీ గోడను నిర్మించడంతో పాటు పార్కు అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.