సకల జన సంక్షేమం, ఆరోగ్యమే ధ్యేయంగా ముందుకుసాగుతున్నరాష్ట్ర సర్కారు మరో కొత్త నిర్ణయం తీసుకున్నది. రోజురోజుకూ పెరిగిపోతున్న వాహన కాలుష్యానికి చెక్పెట్టడంతోపాటు గ్రామైక్య సంఘాల మహిళలకు ఉపాధి కల్పించాలని భావించి, ప్రత్యేకంగా ‘ఈ ఆటోలను’తీసుకువస్తున్నది. స్త్రీనిధి కింద అతి తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చి కొనుగోలు చేయించేందుకు సంకల్పించగా, మంత్రి కేటీఆర్ చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లా పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైంది. తొలి విడుతగా 100 మందికి 3కోట్లతో ప్యాసింజర్, ట్రాలీ ఆటోలు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
రాజన్న సిరిసిల్ల, జనవరి 19 (నమస్తే తెలంగాణ): అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక పురోగతి సాధించే దిశగా తెలంగాణ సర్కారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. అనేక పథకాలతో వ్యవసాయాన్ని పండుగలా మార్చడంతోపాటు గొల్లకుర్మలకు సబ్సిడీతో గొర్రెలను అందించింది. పురుషులతో పాటు మహిళలు అన్ని రంగాలలో ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో పావలా వడ్డీ రుణాలు అందించడమేకాదు మెప్మా ద్వారా గ్రామైక్య సంఘాల మహిళలకు పశుపోషణతో పల్లెల్లో క్షీర విప్లవానికి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు కొత్తగా ‘ఈ’ అటోలతో మెరుగైన ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తూ, సిరిసిల్ల జిల్లాను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది.
100 మందికి రూ.3కోట్ల రుణాలు
రాష్ట్ర సర్కారు చర్యలతో గ్రామైక్య సంఘాలు బలోపేతమవుతున్నాయి. బ్యాంకు లింకేజీ పావలా వడ్డీ రుణాలతో వివిధ వ్యాపారాలు చేస్తూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నాయి. రుణాలు సక్రమంగా చెల్లించడంలో పురుషులకన్నా మహిళలే ముందు వరుసలో ఉన్నారు. దీంతో రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు మహిళలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాయి. బ్యూటీపార్లర్లు, కిరాణం, మ్యాచింగ్ సెంటర్లు, రెడీమెడ్ దుస్తుల తయారీ.. ఇలా చిన్న చిన్న కుటీర పరిశ్రమలను పెట్టుకుని ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి చేరుకుంటున్నారు. వారికి మరింత ప్రోత్సాహాన్ని అందించాలన్న ఉద్దేశంతో అతి తక్కువ వడ్డీకే మెప్మా సంస్థ ‘శ్రీనిధి’ మహిళా బ్యాంకు ద్వారా రుణాలు అందిస్తున్నది. ఈ క్రమంలో ప్రభుత్వ సూచనలతో ఒకవైపు కాలుష్యాన్ని నివారిస్తూనే మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే దిశగా ‘ఈ ఆటోలను రుణాలపై అందించాలని నిర్ణయించింది. మున్సిపల్ పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చొరవతో మెప్మా సంస్థ సిరిసిల్లను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంది. తొలి విడతగా 100 మందికి రూ.3కోట్లతో స్త్రీనిధి మహిళా బ్యాంకు ద్వారా రుణ సౌకర్యం కల్పించనున్నది.
రూ.3లక్షల దాకా రుణం..
ఏ,బీ,సీ,డీ గ్రేడ్లోని గ్రామ, స్లమ్ సంఘాలకు అనుబంధంగా ఉండే సంఘ సభ్యులు స్త్రీనిధి రుణాలకు అర్హులు. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ ఆటో లేదా ట్రాన్స్పోర్టు ట్రాలీ ఆటోలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. స్త్రీనిధి బ్యాంకు ద్వారా 3లక్షల దాకా 11శాతం వార్షిక వడ్డీ రేటుతో రుణం ఇస్తుంది. ఆటోల ధర రూ.2లక్షల నుంచి 3లక్షల మధ్యలో ఉంది. నెలసరి వాయిదా 5,890 చెల్లించాల్సి ఉంటుంది. ఐదు సీట్లు ఉన్న ప్యాసింజర్, ట్రాలీ ఆటోలకు 2గంటలు చార్జింగ్ పెడితే 100 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఈ లెక్కన ప్యాసింజర్ ఆటో ద్వారా నెలకు 16,500, ట్రాలీ అటో ద్వారా 17,500 నికర ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఆసక్తి ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకుంటే వెంటనే రుణాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బైక్లకు కూడా 75వేల దాకా రుణం ఇస్తున్నారు.
ఎంతమందికైనా ఇచ్చేందుకు సిద్ధం..
గ్రామైక్య సంఘాలకు ఎలక్ట్రిక్ ఆటోలు, ట్రాలీలతో ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిరిసిల్ల పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైనందున ఎక్కువ మంది మహిళలకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించాం. తొలి విడుతలో మాత్రం 100 మందికి ఇవ్వాలని ప్రణాళికలు రూపొందించాం. ఇప్పటికే చాలా దరఖాస్తులు వచ్చాయి వారందరికీ త్వరలో ఆటోలు అందజేస్తాం. ఎంత మందికైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.