మోత్కూరు , జనవరి 14 : కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ వారి వెన్ను విరుస్తున్నదని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. వ్యవసాయం మోదీకి ఎలర్జీగా మారిందని, అందుకే రైతులపై పగపట్టినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏడేండ్ల పాలనలో రైతుల సంక్షేమం కోసం ఒక్క పథకాన్ని అమలు చేయకపోగా ఎరువుల ధరలు పెంచి, నల్ల చట్టాలను తెచ్చి నడ్డి విరిచిందన్నారు. వ్యవసాయ పరికరాలపైనా జీఎస్టీ పెంచడంతో ఆధునిక పనిముట్లు రైతులు కొనుగోలు చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సాగుకు ఉచిత విద్యుత్ ఇస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి పెంచుతుందన్నారు. డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధర పెంపుతో సామాన్యులపైనా తీవ్ర భారం పడిందన్నారు. ఎరువుల ధరలు పెంచినట్లే పంటలకూ మద్దతు ధర పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇటీవల ఎంపీపీగా ఎన్నికైన రచ్చకల్పనను శాలువాతో సన్మానించారు. మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రి, వైస్ చైర్మన్ బి వెంకటయ్య, ఎంపీపీ రచ్చ కల్పన, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొణతం యాకూబ్రెడ్డి, మాజీ చైర్మన్ తీపిరెడ్డి మేఘారెడ్డి, నార్మాక్స్ డైరెక్టర్ లక్ష్మీనర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పొన్నెబోయిన రమేశ్, రైతుబంధు కోఆర్డినేటర్ కొండ సోంమల్లు, మాజీ ఎంపీటీసీ జంగ శ్రీను, మాజీ సర్పంచులు బయ్యని పిచ్చయ్య, నిమ్మల వెంకటేశ్వర్లు, నాయకులు గజ్జి మల్లేశ్, జి శ్రీనివాస్, శ్రీకాంతాచారి పాల్గొన్నారు.