గతంలో కంటే 15 శాతం అధికంగా కొనుగోలు
అసలైన లబ్ధిదారులకే సరుకులు
ఖమ్మం, మార్చి 8: ‘రేషన్ దుకాణాల్లో సరుకులను తీసుకోవాలంటే ఎంతో కష్టపడాలి. ఎందుకంటే కార్డుదారుడు రేషన్ దుకాణానికి వెళ్తే దుకాణం తెరిచి ఉంటుందో లేదో తెలియదు. ఒకవేళ రేషన్ దుకాణం తెరిచి ఉన్నా డీలర్, గుమస్తా ఉంటాడో లేదో తెలియదు. లబ్ధిదారుడి పట్ల అమర్యాదగా వ్యవహరించడం, సమయపాలన లేకపోవడం, నాసిరకమైన బియ్యం పొయ్యడం, రిజిస్టర్లో పేరు లేదని పదేపదే తిప్పడం వంటి ఎన్నో సమస్యలు.’ అనే మాటలు ఇక గతం. తెలంగాణ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖలో ప్రవేశపెట్టిన సంస్కరణల ఫలితంగా కార్డుదారుడు దర్జాగా తనకిష్టమైన, అనుకూలమైన డీలర్ వద్ద రేషన్ సరుకులు తీసుకునే వెసులుబాటును కల్పించింది. ఫలితంగా ప్రజలకు ఎంతో ఉపయోగం జరుగుతోంది. పౌరసరఫరాల శాఖ గత నెల 1 నుంచి ఐరిస్, ఓటీపీ విధానాల ద్వారా బియ్యాన్ని, ఇతర సరుకులను అందచేస్తోంది. బయోమెట్రిక్ విధానం ద్వారా అయితే కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉండడంతో ఐరిష్, ఓటీపీ పద్ధతుల్లో రేషన్ సరుకులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగానే గత నెల 1 నుంచి ఈ విధానాన్ని జిల్లాలో అమలు చేస్తోంది.
పెరిగిన విక్రయాలు..
రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీలో నూతనంగా ప్రవేశపెట్టిన ఐరిష్, ఓటీపీ విధానాల ద్వారా బియ్యం తీసుకెళ్లే లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. కార్డుదారుడు రేషన్ దుకాణానికి రాగానే డీలర్లు ఐరిష్ ద్వారా కార్డుదారుల కండ్లను స్కాన్ చేసి బియ్యం ఇస్తున్నారు. ఒకవేళ వృద్ధుల వివరాలు ఐరిష్ ద్వారా రాకపోతే వారి ఆధార్కు లింక్ అయిన సెల్ఫోన్కు వచ్చిన ఓటీపీ (వన్ టైమ్ పాస్వర్డ్) ఆధారంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 669 రేషన్ దుకాణాలు ఉండగా 4,05,340 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ప్రతి నెలా 6,508 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని కార్డుదారులకు అందజేస్తున్నారు. గతంలో ఉన్న బయోమెట్రిక్ విధానం వల్ల కొందరి వేలుముద్రలు పడకపోవడంతో బియ్యం తీసుకెళ్లే వారి సంఖ్య తక్కువగా ఉండేది. గత నెలలో ఐరిస్, ఓటీపీ ద్వారా జిల్లాలో 76 శాతం కార్డుదారులు బియ్యం తీసుకెళ్లారు. 3,20,000 మంది ఫిబ్రవరిలో రేషన్ తీసుకున్నారు. గతంలో 71 శాతం మంది లబ్ధిదారులు మాత్రమే బియ్యం తీసుకెళ్లేవారు.
1,112 రేషన్ దుకాణాలు..
ఉమ్మడి జిల్లాలో 1,112 రేషన్ దుకాణాలు ఉండగా మొత్తం 6,71,339 రేషన్ కార్డుదారులున్నారు. వీరిలో అన్నపూర్ణ కార్డుదారులు ఇద్దరు, ఆహారభద్రత కార్డులు 6,27,178, అంత్యోదయ కార్డులు 17,573 ఉన్నాయి. వీరిందరికీ నెలనెలా ప్రభుత్వం నుంచి రేషన్ సరుకులు దుకాణాల ద్వారా అందుతున్నాయి.