ఆదిలాబాద్ జిల్లాలో పశువుల అక్రమ రవాణా జోరుగా కొనసాగుతున్నది. మహారాష్ట్ర నుంచి మూగజీవాలను తీసుకొస్తున్న దళారులు ఆదిలాబాద్ మార్కెట్ యార్డుతోపాటు వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ఒక్కో వాహనంలో 20 నుంచి 30 వరకు మూగజీవాలను కుక్కి హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రైతుల పేరిట ఆవులు, దూడలు, ఎడ్లను అక్రమంగా రవాణా చేస్తున్నారు. వాహనాల డ్రైవర్లు మితిమీరిన వేగంతో నడపడంతో ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు వాహనాల్లో కుక్కడంతో మూగజీవాలు చనిపోతున్నాయి.
ఆదిలాబాద్, మే 15 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ మార్కెట్యార్డులో పశువుల విక్రయాలు జరుగుతాయి. ప్రతి సోమ, శనివారం మార్కెట్యార్డుకు దళారులు మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి పశువులను తీసుకొస్తారు. జిల్లా కేంద్రంతో పాటు జైనథ్, బేల, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, బోథ్, ఉట్నూర్ ప్రాంతాల్లో పశువుల సంత జరుగుతుంది.
నాగ్పూర్ నుంచి జాతీయ రహదారి మీదుగా, చంద్రాపూర్-కాగజ్నగర్-ఉట్నూర్ మీదుగా, నాందేడ్ నుంచి బజార్హత్నూర్ మండలం ఘన్పూర్ చెక్పోస్టు నుంచి కిన్వట్-లక్ష్మీపూర్ చెక్పోస్టు మీదుగా పశువుల రవాణా కొనసాగుతున్నది. లారీలు, వ్యాన్లు, ట్రక్కులతో పాటు ఇతర నాలుగు చక్రాల వాహనాల్లో పరిమితికి మించి వీటి ని తీసుకుపోతున్నారు. ఒక్కో వాహనంలో 20 నుంచి 30 పశువులను కింద పడేసి తాళ్లతో కట్టి తీసుకుపోతారు. ఆవులు, దూడలు, ఎడ్లను హైదరాబాద్తో పాటు ఇతర పట్టణాలకు తరలిస్తారు.
పక్కరాష్ట్రంలోని యవత్మాల్, కిన్వట్, చంద్రాపూర్, మాడ్వి ప్రాంతాల నుంచి లారీ, వ్యాన్లలో ఎడ్లు, ఆవులు, లేగ దూడలను ఊపిరాడకుండా కట్టేసి రవా ణా చేస్తున్నారు. పైగా కనీస నిబంధనలు పాటించడం లేదు. వాహనా ల్లో కుక్కి, పడుకోబెట్టి పైన టార్పాలిన్ కవర్లు కప్పి వందల కిలోమీటర్ల దూరం ఇష్టానుసారంగా తరలిస్తుండడంతో పశువులు ఊపిరాడ క, గాయాల బారిన పడి మరణిస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి జాతీయ రహదారి మీదుగా, ఇతర మార్గాల గుండా పోయే వాహనాలు ఎక్కువ స్పీడ్తో వెళ్తుండడంతో జిల్లాలోని పలుచోట్ల పశువుల వాహనాలకు ప్రమాదాలు జరిగాయి. ఇటీవల ఇచ్చోడ మండలం సాత్నంబర్ వద్ద కంటైనర్ బోల్తా పడగా.. 10 పశువులు చనిపోయాయి.
నూతన రవాణా చట్టం ప్రకారం మూగజీవాలను తరలించేందుకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ కలిగిన వాహనాలు ఉండాలి. ఈ వాహనాల్లో పశువులను తీసుకుపోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఒక్కో పశువుకు మూడు మీటర్ల దూరం ఉండాలి. కేవలం రాత్రి సమయంలో మాత్రమే రవాణా చేయాలి. పశువులను ఆరు గంటలకు మించి రవాణా చేయరాదు. ఈ సమయం దాటితే అనువైన ప్రదేశాల్లో దించి మేత, నీరు అందించాలి. దళారులు మాత్రం ప్రత్యేక వాహనాల్లో కాకుండా వ్యాన్లు, ట్రక్కులు, లారీలు, కంటైనర్లలో పశువులను కుక్కి తీసుకుపోతున్నారు.
పశువులను రవాణా చేయాలంటే సంబంధిత శాఖల అధికారుల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోతున్నారు? ఎవరు? ఎవరికి విక్రయిస్తున్నారు? అనే వివరాలు తెలియజేయాలి. ఆవులు, దూడల రవాణాపై నిషేధం ఉండగా, వ్యవసాయానికి పనికిరాని ఎడ్లను రైతులకు మాత్రమే విక్రయించాలి. ఇందుకుగానూ పశుసంవర్ధక శాఖ అధికారులు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. పశువుల రవాణాలో దళారులు నిబంధనలు పాటించడం లేదు.
పశువుల క్రయ, విక్రయాల్లో తమను ఎవరైనా సంప్రదిస్తే పరిశీలించి ధ్రువపత్రాలు అందజేస్తామని పశుసంవర్ధక శాఖ అధికారులు అంటున్నారు. కాగా.. ఆదిలాబాద్ మార్కెట్లో పశువుల విక్రయాలు జరుగుతున్నాయని, ఒకశాతం ఫీజు విక్రయదారులు తమకు చెల్లిస్తారని మార్కెట్యార్డు అధికారులు తెలిపారు. ఎలాంటి పత్రాలతో తమకు సంబంధం లేదని చెబుతున్నారు.