భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : కన్నతల్లి ప్రసవ వేదన ఎలా ఉంటుందో అబలకే తెలుసు. అమ్మగా బిడ్డను తాము తమ పిల్లలను వెచ్చని పొత్తిళ్లలో పెంచుకున్న జ్ఞాపకాలు వారు ఎలా మరిచిపోగలరు?. అందుకే వారు ఎప్పుడూ ‘అమ్మ’కు తోడుగా ఉంటారు. తాము ఆపదలో పడతామని తెలిసి కూడా తల్లులకు, పిల్లలకు తోడుగా నిలుస్తున్నారు. అది కరోనా అయినా.. అంతకుమించిన వైరస్ మరేదైనా.. మహమ్మారి వ్యాపించే ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ కరోనా బాధిత నిండు గర్భిణులకు ప్రసవం చేస్తున్నారు. గర్భిణికి కరోనా సోకిందని తెలియగానే ఆమె తల్లిదండ్రులు, భర్త, ఇతర కుటుంబ సభ్యులు అల్లంత దూరాన వెళ్తున్న ఈ రోజుల్లో ఆసుప్రతిలో డాక్టరమ్మలు మాత్రం అక్కున చేర్చుకుంటున్నారు. కాబోయే అమ్మలకు అండగా నిలుస్తున్నారు. ఇక కరోనా అనగానే ప్రైవేటు వైద్యంలో కాసులే కాసులు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యం ఇందుకు భిన్నం. కరోనా వంటి ప్రమాదకర పరిస్థితులు ఉన్నా సర్కారు వైద్యులు ప్రాణాలను సైతం లెక్కచేయక తల్లీబిడ్డలకు ప్రాణం పోస్తున్నారు. నిరుడు కరోనా కష్టకాలంలో ప్రైవేటు వైద్యులు దరిచేరనీయని సమయంలో కూడా ప్రభుత్వ వైద్యులు కొవిడ్ బాధిత గర్భిణులకు గణనీయంగా ప్రసవాలను చేసి బాసటగా నిలిచారు. తాజాగా థర్డ్ వేవ్లో ఇప్పుడూ అదే పరిస్థితి నెలకొంటోంది. ఇందుకోసం భద్రాద్రి జిల్లాలో కొత్తగూడెం, భద్రాచలం ఏరియా ఆసుపత్రుల్లో కరోనా ప్రసవాల కోసం ప్రత్యేక వార్డుల్లో బెడ్లను అందుబాటులో ఉంచారు.
కష్టకాలంలోనూ గణనీయంగా ప్రసవాలు
ఓ వైపు కరోనా థర్డ్ వేవ్ భయపెడుతుంటే కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మాత్రం కరోనా సోకిని గర్భిణులకు అండగా నిలుస్తోంది. కరోనా పాజిటివ్ ఉన్న గర్భిణి ఈ నెల 17న కాన్పు కోసం భద్రాద్రి ఆసుపత్రికి వచ్చింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సరళ, సిబ్బంది కలిసి ఆమెను చేర్చుకొని ప్రసవం చేశారు. డాక్టర్కు గతంలో కరోనా వచ్చి పదిహేను రోజులు హోం ఐసొలేషన్లో ఉన్నారు. అయినా భయపడకుండా పీపీఈ కిట్లు ధరించి కరోనా సోకిన గర్భిణికి ప్రసవం చేశారు. పండంటి బిడ్డను భూమ్మీదకు తెచ్చారు. నిరుడు కూడా ఏకంగా 30 మంది గర్భిణులకు ప్రసవాలు చేసి తల్లీబిడ్డలకు అండగా నిలిచారు. దీంతో అప్పట్లో ప్రభుత్వ ఆసుపత్రి వైద్య బృందానికి ఉన్నతాధికారులు ప్రశంసలు అందాయి.
ప్రాణాలను లెక్కచేయక..
వైద్య ధర్మంతోపాటు మాతృత్వపు అనుభూతి తెలుసు కాబట్టి ప్రభుత్వ వైద్యురాళ్లు, నర్సులు కూడా తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సేవాతత్పరతను చాటుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా కొత్తగూడెం, భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కరోనా గర్భిణులకు ప్రసవాలు జరిగాయి. గర్భిణి ఆరోగ్య పరిస్థితిని బట్టి సుఖ ప్రసవాలు చేస్తున్నారు. అవసరాన్ని బట్టి ఆపరేషన్లు సైతం చేస్తున్నారు.
కొవిడ్ ప్రసవాలకు 38 స్పెషల్ బెడ్స్..
గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆ ఏడాది కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ ప్రసవాల కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. కేవలం ప్రసవాలతోపాటు వారితో ఉన్న పిల్లలకు కూడా ఆక్సిజన్ బెడ్లు అవసరం ఉన్నందున వారికి కూడా బెడ్లను అందుబాటులో ఉంచారు. భద్రాచలంలో 18 బెడ్లు, కొత్తగూడెంలో 20 బెడ్లు సిద్ధంగా ఉన్నాయి. పిల్లల కోసం భద్రాచలంలో 20 ఆక్సిజన్ బెడ్లు, కొత్తగూడెంలో 20 ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయి.
కన్నప్రేమను మరిచిపోలేం..
అమ్మగా కన్నప్రేమను ఎలా మరచిపోగలం? తొమ్మిది నెలలు కడుపులో బిడ్డను మోసిన జ్ఞాపకం గుర్తుకు తెచ్చుకుంటే ఎలాంటి ఆపదలో ఉన్న తల్లినైనా కాపాడాలనిపిస్తుంది. అంతేకాదు.. ఓ వైద్యురాలిగా నా వృత్తి ధర్మాన్ని బాధ్యతతో నెరవేరుస్తా. కరోనా బాధిత గర్భిణులకు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రసవాలు చేస్తున్నాం. నాతో పాటు నర్సులు, ఆయాలు కూడా ఎంతో ధైర్యంగా విద్యుక్త ధర్మంగా విధులు నిర్వర్తిస్తున్నారు. నిరుటి అనుభవంతో ఈ ఏడాది కూడా థర్డ్ వేవ్లో సిద్ధంగా ఉన్నాం.