పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్
బుద్ధవనం సందర్శన.. కృష్ణానదిలో లాంచీలో విహారం
నందికొండ, డిసెంబర్ 26 : సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన పర్యాటక స్థలాలు, చారిత్రక ప్రదేశాల అభివృద్ధి స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో జరుగుతున్నదని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ చొరవతోనే ఫణిగిరి, ధూళికట్టు, బుద్ధవనం వంటి చారిత్రక ప్రాంతాల అభివృద్ధి జరిగిందని తెలిపారు. బుద్ధవనం పనులపై నివేదికను ముఖ్యమంత్రికి అందించి త్వరలో తుది మెరుగులు చేపడుతామని చెప్పారు. ఆదివారం ఆయన నందికొండలో బుద్ధవనాన్ని సందర్శించారు. బుద్ధుడి పాదాలకు పుష్పాంజలి ఘటించి, మహాస్తూపంపై ఏర్పాటు చేసిన శిల్పాలను పరిశీలించారు. వివిధ పత్రికల ఎడిటర్లు, జర్నలిస్టులతో కలిసి కృష్ణానదిలో లాంచీలో జాలీ ట్రిప్పు వెళ్లారు. ఈ సందర్భంగా విలేకరులతో మంత్రి మాట్లాడుతూ బుద్ధవనం రాష్ర్టానికి మణిహారంగా నిలుస్తుందన్నారు. నాగార్జునసాగర్ అంటే జలాశయం మాత్రమే కాదని చారిత్రక నేపథ్యం కలిగిన బౌద్ధ ప్రాంతమని పేర్కొన్నారు. బుద్ధవనం ప్రాజెక్టుకు అనుసంధానంగా పర్యాటక రిసార్ట్లు, సాహస క్రీడలు, బోటింగ్, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రా సంయుక్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ఉమ్మడిగా కృషి చేస్తామన్నారు. ఆంధ్రా ప్రాంతంలో ఉన్న నాగార్జునకొండకు లాంచీలను నడుపడానికి అన్ని అనుమతులు తీసుకుంటామని చెప్పారు. అంతకు ముందు హిల్కాలనీ విజయవిహార్లో మంత్రి శ్రీనివాస్గౌడ్కు బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. మంత్రి వెంట తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, పర్యాటక సంస్థ ఎండీ మనోహర్, బుద్ధవనం ఎస్ఈ క్రాంతిబాబు, ఆర్కియాలజీ నిపుణులు ఈమని శివనాగిరెడ్డి, సహాయక శిల్పి శ్యామ్సుందర్, నందికొండ మున్సిపల్ చైర్పర్సన్ కర్న అనూషారెడ్డి, కౌన్సిలర్ నిమ్మల ఇందిర పాల్గొన్నారు.
రాష్ర్టానికి మణిహారం
బుద్ధవనం
మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
నందికొండ : బుద్ధవనం తెలంగాణ రాష్ర్టానికి మణిహారం అని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య నేతృత్వంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంపాదకుల బృందం శనివారం బుద్ధవనాన్ని సందర్శించింది. జాతకపార్కు, మహాస్తూపంపై శిల్పాలు, ధ్యాన మందిరం, అవకాన బుద్ధను పరిశీలించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బుద్ధవనానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తున్నదన్నారు. బుద్ధుడి జీవిత విశేషాలు, బోధనలు, బుద్ధిజం గొప్పదనాన్ని ప్రపంచానికి చాటేలా చారిత్రక నాగార్జునసాగర్లో బుద్ధవనం ప్రాజెక్ట్ నిర్మించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రకృతి ఒడిలో బుద్ధవనాన్ని తీర్చిదిద్దినందుకు ముఖ్యమంత్రికి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. సంపాదకుల బృందంలో శ్రీనివాస్రెడ్డి, పులిపాక బాలు, కె.మహేశ్, చంద్రశేఖర్, చంద్రమౌళి, మంజులత, గంగాధర్, సోమశేఖర్, సుధాభాస్కర్, వేణుగోపాల్, దిలీప్ ఉన్నారు.