పెద్దపల్లి/ధర్మారం, జూన్ 22(నమస్తే తెలంగాణ): కాళేశ్వర గంగ పరుగులు పెడుతున్నది. లింక్-1,2లో పరవళ్లు తొక్కుతున్నది. ఒక్కో పంప్హస్లోని మోటర్ల ద్వారా రోజుకు రెండు టీఎంసీల వరకు తరలివెళ్తున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మీపంపు హౌస్లో 10 పంపులు ఆన్చేసి 21వేల క్యూసెక్కుల నీటిని ఎగువన అన్నారంలోని సరస్వతీ బరాజ్లోకి తరలిస్తున్నారు. సరస్వతీ పంపు హౌస్లో 7 పంపులు ఆన్చేసి 20,510 క్యూసెక్కులు పార్వతీ బరాజ్లోకి ఎత్తిపోస్తున్నారు. ఇక పార్వతీ పంపు హౌస్లోనూ 7 పంపులు ఆన్చేసి ఎల్లంపల్లి జలాశయంలోకి 18,270 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు.
లింక్-2లో పరుగులు..
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్హౌస్లో నాలుగు మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. మొత్తం 12,600 క్యూసెక్కుల నీటిని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రీ పంప్హౌస్కు తరలిస్తున్నారు. అలాగే అక్కడి నుంచి నాలుగు మోటర్ల ద్వారా అదే పరిమాణంలో రాజన్న సిరిసిల్లలోని బోయినిపల్లి మండలం శ్రీరాజరాజేశ్వర జలాశయానికి తరలిపోతుంది. జలాల తరలింపును నీటి పారుదల శాఖ రామగుండం ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.