9637474999కు కాల్ చేయండి
ఖైరతాబాద్, డిసెంబర్ 20 : హిందూ సంప్రదాయంలో దేవీ దేవతల చిత్రపటాలు ప్రతి గృహంలో దర్శనమిస్తాయి. ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తుంటారు. కార్డుబోర్డు, కర్రతో తయారు చేసిన పటాలు కావడంతో అవి దెబ్బతింటాయి. వాటిని కొందరు దేవాలయాల్లో, మరికొందరు చెట్ల వద్ద పెడుతారు. ఇంకొందరు తెలిసీ తెలియక అపరిశుభ్రమైన స్థలాల్లో వదిలేస్తారు. ఇది అపచారమని, శాస్ర్తోక్తంగా హోమం చేసి వాటిని అగ్నిదేవుడికి సమర్పిస్తామని ధర్మో రక్షతి రక్షితః ట్రస్ట్ చెబుతున్నది. ఈ బృహత్కార్యం కోసం దేవీ దేవతల చిత్రపటాల పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆ విశేషాలను ట్రస్ట్ అధ్యక్షుడు ప్రేమ్గాంధీ, సమితి అధ్యక్షుడు జీఎస్ మూర్తి, గౌరవ అధ్యక్షుడు, సినీ నిర్మాత గురురాజ్, కోశాధికారి అంజయ్య, కార్యదర్శి మహేశ్తో కలిసి సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. చిత్ర పటాలు పడైతే వాటిని నిర్లక్ష్యంగా పడేయకూడదన్నారు. శ్రీ శైవక్షత్ర పీఠాధిపతి పరమపూజ్య శ్రీశ్రీశ్రీ శివస్వామిజీ సూచనల మేరకు వాటిని శాస్ర్తోక్తంగా హోమం చేసి అగ్ని దేవుడికి సమర్పించే మహాకార్యాన్ని సంకల్పించామన్నారు. చిత్రపటాలతో పాటు దేవతల క్యాలెండర్లను సైతం సేకరిస్తామన్నారు. ఇందుకు త్వరంలోనే నగరంలోని 150 డివిజన్లలో సబ్ కమిటీలు వేస్తున్నామని తెలిపారు. ఇంటిలో, షాపుల్లో చిత్రపటాలు, క్యాలెండర్లు దెబ్బతింటే వెంటనే టోల్ఫ్రీ నం.96374749 99లో సంప్రదించాలని సూచించారు.