దేశంలో తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగురవేసిన గొప్ప నాయకుడు
పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యం
కొందరు స్థాయిని మరిచి చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలి
అంతా కలిసికట్టుగా పనిచేయాలి
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్
హుజూరాబాద్ టౌన్/ హుజూరాబాద్ రూరల్, జూన్ 17 : దేశంలో ఎక్కడా లేనివిధంగా అమలు చేస్తున్న పథకాల ఘనత సీఎం కేసీఆర్దే అని, దేశ నలుమూలల తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగుర వేసిన గొప్ప నాయకుడని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ ఉద్ఘాటించారు. గురువారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని వివిధ మండలాల పార్టీ శ్రేణులు కరీంనగర్లో వినోద్కుమార్ను కలిశారు. ఈ సందర్భంగా తాజా రాజకీయాలు, టీఆర్ఎస్ శ్రేణులు అనుసరించాల్సిన పద్ధతులు, తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణను అతి తక్కువ కాలంలోనే దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని కొనియాడారు. విప్లవాత్మకమైన పథకాలు ప్రవేశ పెట్టి దేశ వ్యాప్తంగా తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగురవేసారని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు, వినూత్న పథకాలు ప్రవేశపెట్టి ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న సీఎంపై కొంత మంది స్థాయిని మరిచి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి విమర్శలను తిప్పికొట్టాల్సిన బాధ్యత టీఆర్ఎస్ శ్రేణులపై ఉందని సూచించారు.
ఒకసారి అందరూ ఆత్మావలోకనం చేసుకోవాలని సూచించారు. దేశంలో ఎక్కడైనా రైతులకు 24 గంటల కరెంట్ ఉచితంగా ఇస్తున్నారా..? రైతు బంధు పథకం కింద పెట్టుబడి ఇస్తున్నారా? పండించిన పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నారా..? ఆలోచన చేయాలన్నారు. తెలంగాణ వ్యవసాయక ప్రాంతమని గుర్తించడమేకాదు.. అతి తక్కువ సమయంలో అసాధ్యం అనుకున్న పనులను సుసాధ్యం చేసి.. కాళేశ్వరం పూర్తిచేసి.. బీడు భూములకు జలాలు ఇచ్చి.. పచ్చని మాగాణిలుగా మార్చుతున్నది వాస్తవం కాదా..? కోటి ఎకరాల మాగాణే లక్ష్యంగా ప్రాజెక్టులు పూర్తిచేస్తున్నది నిజం కాదా? ఒక్క ప్రాజెక్టును దశాబ్ధాల పాటు నిర్మించే చరిత్రను తిరగ రాసి కేవలం మూడేళ్లలోనే కాళేశ్వరంను నిర్మించింది నిజం కాదా? మిషన్ భగీరథ కింద స్వచ్ఛమైన మంచినీటిని ఇస్తూ ప్రజల అనారోగ్యం బారిన పడకుండా చర్యలు తీసుకున్నది నిజం కాదా? కరోనా లాంటి సంక్షోభ సమయంలోనూ సంక్షేమ కార్యక్రమాలు ఆగకుండా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోలేదా? ఇలా చెప్పుకుంటూ పోతే.. లెక్కకు మించిన పథకాలు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని వివరించారు. “ఆసరా కింద వృద్ధులకు, ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులకు పింఛన్లు, డబుల్ బెడ్రూంలు ఇలా ఎన్నోన్నో పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. వీటిని ప్రజల ముందుకు తీసుకెళ్లాలి. ప్రతిపక్షాలు చేసే విమర్శలను తిప్పి కొట్టే సైనికులుగా టీఆర్ఎస్ శ్రేణులు ఎదగాలి. సీఎం చేస్తున్న పనులు మన కండ్ల ముందు సాక్షాత్కరిస్తున్నాయి. వాటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వాటినే ప్రజలకు మరోసారి వివరించాలని” వినోద్కుమార్ శ్రేణులకు తెలిపారు. హుజూరాబాద్లో అనేక సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ అమలు చేశారని పేర్కొన్నారు.
రైతుల దశ దిశను తిప్పిన రైతు బంధు పథకం హుజూరాబాద్ గడ్డపైనే సీఎం ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాదు.. ఎన్నికలు ఏవైనా వ్యక్తులతో సంబంధం లేకుండా హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలు తమ గుండెల్లో గులాబీ జెండాకు స్థానం ఇచ్చి అశేష విజయాలను అందించారని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అధినేత పిలుపు ప్రకారం అందరం కలిసి కట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థి విజయానికి సైనికుల్లా పనిచేయాలని పిలుపు నిచ్చారు. ఆయనను కలిసిన వారిలో టీఆర్ఎస్ యూత్ ముఖ్య నాయకులు తొగరు భిక్షపతి, తొగరు శివకృష్ణ, యూత్ నాయకులు ఉప్పు శ్రీనివాస్, రవికాంత్, ప్రసాద్, నవీన్, విజయకుమార్ రెడ్డి, అభిలాష్, ముస్తఫా, ఆఫ్రోజ్, కిరణ్, నరేశ్, రామకృష్ణ, నాగరాజు తదితరులు ఉన్నారు.