ఆత్మకూరు, అక్టోబర్ 16 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించిందని, వాటిని దసరా రోజు ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ గ్రామంలో 52 డబుల్ బెడ్రూం ఇండ్లను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి సర్పంచ్ బీరం శ్రీలతా రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించగా మంత్రి మాట్లాడారు. పరకాల నియోజకవర్గానికి 2వేల ఇండ్లు మంజూరు చేస్తే, ఇప్పటి వరకు ఎమ్మెల్యే చల్లా 600 ఇండ్లు కట్టించి నిరుపేదలైన లబ్ధిదారులకు అందజేసినట్లు చెప్పా రు. గూడెప్పాడ్ గ్రామానికి 94 ఇండ్లు మంజూరు కాగా, ఈరోజు 52 గృహాలను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. మిగతా ఇండ్లు వచ్చే నెలలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయనున్నట్లు చెప్పారు.
త్వరలోనే నియోజకవర్గానికి ప్రభుత్వం మరో1500 ఇండ్లు మంజూరు చేయబోతున్నదని చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి ఈటల రాజేందర్ 4 వేల ఇండ్లు మంజూరు చేయించుకుని 50 ఇండ్లు కట్టించి ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్, ఇందిరాగాంధీ హయాంలోనే పేదలకు న్యాయం జరిగిందన్నారు. గత ప్రభుత్వాలు ఏనాడూ కూడా పేదల అభ్యున్నతి కోసం పాటుపడలేదన్నారు. గత ప్రభుత్వం రూ.25 వేల ఇస్తే, అవిసరిపోక పోవడంతో అప్పులపాలయ్యారన్నారు. కొంత మంది పాత ఇండ్లకు బిల్లులు తీసుకున్నారని ఆరోపించారు. ఒక కాలనీలాగా ఇండ్లు కట్టించి పేదలకు ఇవ్వాలనే ప్రణాళికతో సీఎం కేసీఆర్ ముందుకు పోతున్నాడన్నారు. గ్రామాల్లో ప్రభుత్వం భూమి లేక పోవడంతో ఎవరి ఖాళీ జాగలో వారే డబుల్ బెడ్రూం ఇల్లు కట్టుకునేలా జీవో తీసుకొచ్చారన్నారు. 40వేల కోట్ల రూపాయల ఖర్చు చేసి మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్యసౌకర్యం అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రూ. 2 వేల కోట్లు వెచ్చించి వరంగల్లోని సెంట్రల్ జైలు స్థలంలో అధునాతనమైన సూపర్ స్పెషలిటీ దవాఖానను కట్టించబోతున్నారన్నారు. రోగులకు, వారితో వచ్చే కుటుంబ సభ్యులకు సైతం గదులను నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పరకాల నియోజకవర్గానికి డైనమిక్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఉన్నాడన్నారు. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందన్నారు.
సీఎం కేసీఆర్ పథకాలే దేశానికి ఆదర్శం
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను చూసి తట్టుకోలేక ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయని వాటిని తిప్పి కొట్టాలన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో రూ.800 పింఛన్ ఇచ్చి చేతుల దులుపుకుంటుందన్నారు. కరోనా సమయంలో సైతం సంక్షేపథకాలను ఆపకుండా నిధులు మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు మార్క సుమలత, కాగితాల శంకర్, జడ్పీటీసీ కక్కెర్ల రాధిక, పరకాల మార్కెట్ చైర్మన్ బండి సారంగపాణి, వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్రెడ్డి, సర్పంచ్ శ్రీలత, ఆర్డీవో వాసు చంద్ర, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, డీఈ లింగారెడ్డి, ఏసీపీ శివరామయ్య, తహసీల్దార్ సురేశ్కుమార్, ఎంపీవో చేతన్రెడ్డి, పీఆర్ఏఈ క్రిష్టయ్య, ఉపసర్పంచ్ వీసం శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శి బొల్లోజు కుమారస్వామి, కూడా డైరెక్టర్ ఎనకతళ్ల రవీందర్, ఎంపీటీసీలు బయ్య రామరాజు, గూడెప్పాడ్ మార్కెట్ మాజీ చైర్మన్ కాంతాల కేశవరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు దుంపల్లిపెల్లి బుచ్చిరెడ్డి, కక్కెర్ల రాజు, రజనీకర్, సావురే రాజేశ్వర్రావు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
.