శరవేగంగా నియామకాలు
సింగరేణిలో పెరుగుతున్న యువ రక్తం
ఆనందంలో కార్మిక కుటుంబాలు
రామగిరి, మే 16: సింగరేణి కార్మిక కుటుంబాల్లో కారుణ్య నియామకాలు సంతోషాన్ని నింపుతున్నాయి. కొలువులు శరవేగంగా భర్తీ అవుతున్నాయి. సంస్థలో యువత సంఖ్య రానురాను పెరుగుతున్నది.సింగరేణిలో జాతీయ సంఘాలు గతంలో నిలిపివేసిన తండ్రీ కొడుకుల ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టు వదలని విక్రమార్కుడిలా తిరిగి కారు ణ్యం రూపంలో అమలు చేస్తున్నారు. నాడు తండ్రుల ఉద్యోగాలు ఇవ్వాలంటే నెలలు… ఒక్కోసారి సంవత్సరాలు సమయం పట్టేది.. కానీ, గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ నేతల ప్రత్యేక చొరవతో సీఎం కేసీఆర్ ఆదేశానుసారం సింగరేణి సీఎండీ శ్రీధర్ దిశానిర్దేశంలో ఇప్పుడు కారుణ్య నియామకాల్లో మరింత దూకుడు పెరిగింది. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజుల్లోనే కార్మికుల డిపెండెంట్లు ఏకంగా నౌకరి పత్రాలను అందుకుంటున్నారు. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసే అవసరమే లేకుండా యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అన్ని పరీక్షలను పూర్తి చేసి డిపెండెంట్ల చేతుల్లో ఉద్యోగ నియామక పత్రాలను పెడుతున్నది.
అంతులేని ఆనందం..
ఒక్క రామగుండం-3, ఏపీఏ ఏరియాల పరిధిలో రెండేళ్ల కాల వ్యవధిలోనే 502 మంది యువకులు ఉద్యోగాల్లో చేరారు. కారుణ్యం ద్వారా ఉద్యోగాలు సాధించిన కార్మిక కుటుంబాల్లో అంతుపట్టలేని ఆనందం నెలకొంటుంది. ప్రస్తుత పరిస్థితిలో ఉన్నత చదువులు అభ్యసించి మంచి ఉద్యోగం సాధించాలంటేనే కష్టతరం. అలాంటిది సింగరేణిలో ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా చక్కటి వేతనంతో కూడిన ఉద్యో గం రావడం అంటేనే కార్మిక కుటుంబాలు అదృష్టంగా భావిస్తున్నాయి.
పుట్టి, పెరిగిన చోటనే..
ఇక చక్కటి జీతం.. అందమైన జీవితం సింగరేణి సొంతం. ఇప్పటి పరిస్థితిలో బయట ఏ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం దొరికినా అది శాశ్వతం అన్న నమ్మకం లేదు. పైగా కుటుంబాలను వదిలి ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్లి పని చేయాల్సిన పరిస్థితి. ఎప్పుడో ఏ పండుగకో దొరికే రెండు, మూడు సెలవులను చేతబట్టుకొని కన్న తల్లిదండ్రులు, ఉన్న ఊరును చూసేందుకు పరుగులు తీయాల్సి వస్తుంది. కానీ పుట్టి, పెరిగిన చోటనే.. అంతకు మించిన ఐదంకెల జీతంతో ఉద్యోగం దొరకడం అంటే మాటలు కాదు. అది ఒక్క సింగరేణి సంస్థతోనే సాధ్యమవుతుంది. ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తుంటే సింగరేణిలో ఉద్యోగం రావడం యాజమాన్యం చెబుతున్నట్టుగానే నిజంగా ఒక అదృష్టమనే చెప్పాలి. ఉన్న చోటనే యాంత్రీకరణ గనుల మ ధ్య పని చేయడం.. ఆశించిన వేతనంతో ఇంటిల్లిపాదితో ఆనందంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభు త్వం కారుణ్య పథకం ద్వారా కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. ఆర్జీ-3, ఏపీఏ ఏరియాల పరిధిలో 2018-21 మధ్యలో 725 మంది మెడికల్ ఇన్వాలిడేషన్ కాగా, అతి తక్కువ సమయంలోనే ఇప్పటివరకు 502 మంది డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించారు.