రూ. 3.50 లక్షల నగదు, కారు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం
ఐదుగురిపై కేసు నమోదు, నలుగురి అరెస్ట్
పరారీలో ప్రధాన నిందితుడు
జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసులు వెల్లడి
భూపాలపల్లి, ఏప్రిల్ 29 : బీదర్ నుంచి భూపాలపల్లికి నిషేధిత అంబర్ ప్యాకెట్లను కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రూ. 10 లక్షల విలువైన అంబర్ ప్యాకెట్లు, ఒక కారు, రూ.3.50 లక్షల నగదు, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని నలుగురిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. గురువారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ వీ శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. గణపురం మండలం గాంధీనగర్ వద్ద గురువారం క్రైం అండ్ టాస్క్ఫోర్స్ సీఐ గుండ్రాతి మోహన్ ఆధ్వర్యంలో సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా, కారులో వచ్చిన నిందితులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. సీసీఎస్ పోలీసులు వెంబడించి కారును ఆపి తనిఖీ చేయగా, ఐదు బస్తాల అంబర్ ప్యాకెట్లు, రూ.3.50 లక్షల నగదు దొరికాయి. కారు డ్రైవర్, అందులో ఉన్న మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్కు చెందిన బెల్లి లక్ష్మణ్, కొంకిమల్ల సాయికుమార్గా పోలీసులు గుర్తించారు. పెద్దపల్లి జిల్లా ఇప్పలపల్లి(కాల్వ శ్రీరాంపూర్)కి చెందిన చొల్లేటి రాకేశ్ అంబర్ ప్యాకెట్ల వ్యాపారం చేస్తున్నాడని, అతని వద్ద కొన్ని నెలలుగా పనిచేస్తున్నామని వారు చెప్పారు.
బీదర్లోని గుర్తుతెలియని వ్యక్తి నుంచి పది అంబర్ ప్యాకెట్ల బస్తాలను తీసుకువచ్చి జిల్లాలోని పలుమండలాల్లో సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. రేగొండ మండలంలోని వెంకటేశ్వర్లపల్లికి చెందిన బైకాని కొమురయ్య ఇంటి వద్ద మరో ఐదు బస్తాల అంబర్ ప్యాకెట్లు ఉన్నాయని వారు చెప్పగా, అతడి ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా మూడు అంబర్ ప్యాకెట్ల బస్తాలు లభించాయి. మరో రెండు బస్తాల గురించి ప్రశ్నించగా సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన కిరాణాషాపు యజమాని గోపగాని భిక్షపతి ఇంట్లో నిల్వ చేసి చుట్టు పక్కల గ్రామాలకు సరఫరా చేస్తుంటాడని కొమురయ్య చెప్పాడు. దీంతో నిందితులు బెల్లి లక్ష్మణ్, కొంకిమల్ల సాయికుమార్, బైకాని కొమురయ్య, గోపగాని భిక్షపతిని అరెస్ట్ చేశామని, ప్రధాన నిందితుడు రాకేశ్ కోసం సీసీఎస్ పోలీసు బృందం గాలింపు చర్యలు చేపట్టిందని అదనపు ఎస్పీ తెలిపారు. విచారణలో ప్రధాన నిందితుడు రాకేశ్ మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, గోదావరిఖని, పెద్దపల్లి ప్రాంతాలను కేంద్రాలుగా చేసుకొని గుట్కా వ్యాపారం చేస్తున్నాడని తెలిసిందన్నారు. పెద్ద మొత్తంలో అంబర్ ప్యాకెట్లను పట్టుకున్న సీసీఎస్ ఇన్స్పెక్టర్ మోహన్, ఏఎస్ఐలు గోపాల్రెడ్డి, అమరేందర్రెడ్డి, కానిస్టేబుళ్లు ప్రవీణ్, రాజును అభినందించారు. వీరికి రివార్డు అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో సీసీఎస్ సీఐ మోహన్, బీసీఆర్బీ ఇన్స్పెక్టర్లు సైదారావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.