రూ.12 లక్షల వ్యయంతో ఏర్పాటు
కలప వినియోగానికి ప్రత్యామ్నాయం
కలెక్టర్ ఆదేశాలతో స్థలాన్ని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్
జనగామ, మే 2 (నమస్తే తెలంగాణ) : కలప వినియోగానికి ప్రత్యామ్నాయంగా మృతదేహాల దహన సంస్కారాల కోసం జనగామలో ప్రత్యేకంగా ఎల్పీజీ శ్మశాన వాటికను ఏర్పాటు చేయనున్నారు. సూర్యాపేట, సిద్దిపేట, గజ్వేల్ మున్సిపాలిటీల్లో నెలకొల్పిన మాదిరిగానే జిల్లా కేంద్రంలోని నెహ్రుపార్కు సాయిరాం గార్డెన్ హిందూ శ్మశానవాటికలో రూ.12లక్షలతో ప్రయోగాత్మకంగా ఎల్పీజీ డబుల్ బర్న్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కలెక్టర్ నిఖిల సూచనలతో మున్సిపల్ కమిషనర్ నర్సింహ, జనగామ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పోకల లింగయ్య, డీఈ రవీంద్రనాథ్, శ్మశానవాటిక అభివృద్ధి కమిటీ చైర్మన్, చాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ అధ్యక్షుడు పజ్జూరి గోపయ్య ఆదివారం శ్మశాన వాటికలో ఎల్పీజీ ప్లాంట్ ఏర్పా టు చేయబోయే స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్లాంట్ కోసం మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక షెడ్డు సహా సింగిల్ ఫేజ్ విద్యుత్ కనెక్షన్, నీరు, ఎర్తింగ్ కనెక్షన్, 3 ఎల్పీజీ వాణిజ్య సిలిండర్లు సమకూర్చాల్సి ఉంటుంది. ఆటోమేటిక్ కట్ ఆఫ్ గ్యాస్ సెన్సార్ విధానంలో 4 కిలోల బర్నర్ గంటకు 4 కిలోల ఎల్పీజీని మండిస్తుంది.