వేదకాలం నాటి మహిళలు విదుషీమణులు. బ్రహ్మవిద్యపైనా వారికి పట్టు ఉండేది. బృహదారణ్యక ఉపనిషత్తులోని గార్గి అందుకు ఉదాహరణ. జీవన్ముక్తుడైన జనక మహారాజు ఒక గొప్ప యజ్ఞాన్ని చేశాడు. ఎందరో తత్వవేత్తలు దానికి విచ్చేశారు. వారిలో గొప్ప జ్ఞానికి దానం చేయాలని సంకల్పించి వేయి గోవులు తెప్పించాడు. ఎవరు గొప్ప జ్ఞానులో వారివే ఇవి అన్నాడు.
మహా తత్వవేత్త అయిన యాజ్ఞవల్క్య మహర్షి వాటిని తరలించమని శిష్యుడిని పురమాయించాడు. అందరికీ కోపం వచ్చింది. పురోహితుడైన అశ్వలుడు, అరుణి మొదలైన మహర్షులు బ్రహ్మవిద్య గురించి ఎన్నో ప్రశ్నలు వేసి యాజ్ఞవల్క్యుని నుంచి సముచితమైన సమాధానాలు పొందారు. వచక్ను మహర్షి కూతురు గార్గి అక్కడే ఉంది. ఆమె ఎంతో ప్రతిభావంతురాలు. బ్రహ్మవాది, బ్రహ్మచారిణి. ఆమె యాజ్ఞవల్క్య మహర్షిని ఇలా ప్రశ్నించింది..
గార్గి: అన్నీ జలంలోనే ఉన్నాయి కదా! జలం దేనిలో ఉంది?
యాజ్ఞవల్క్యుడు: వాయువులో
గార్గి: వాయివు దేనిలో ఉంది?
యాజ్ఞవల్క్యుడు: అంతరిక్షంలో.. చర్చ పరబ్రహ్మం వరకు వెళ్లింది. ఇక ఇది చర్చించలేనిది, లేదని చెప్పలేం.. అంతా అదే అన్నాడు యాజ్ఞవల్క్యుడు.
గార్గి: త్రికాలాలలో.. మూడు లోకాలలో ఏది వ్యాపించి ఉంది?
యాజ్ఞవల్క్యుడు: ఆకాశం.
గార్గి: ఆకాశం దేనిలో ఉంది?
యాజ్ఞవల్క్యుడు: అక్షరంలో.. అదే పరబ్రహ్మం. అది స్థూలం కాదు. సూక్ష్మం కాదు. పంచభూతాలలో ఏదీ కాదు. ఏకం, అద్వితీయం. లోకాలన్నీ దానివల్లే స్థిరంగా ఉన్నాయి. కాలం సరిగ్గా నడుస్తున్నది. అది లేకపోతే గడ్డిపోచైనా కదలదు. యాజ్ఞవల్క్యుని విశిష్టమైన విశ్లేషణ విని గార్గి.. ఈ మహర్షిని జయించలేమని పండితులకు చెప్పింది. జనకుడు సంతృప్తి చెంది యాజ్ఞవల్క్యుణ్ని ఘనంగా సన్మానించాడు. ఆనాటి స్త్రీ శక్తి ఎంత గొప్పదో గార్గి వృత్తాంతం తెలియజేస్తుంది.
…?డా॥ వెలుదండ సత్యనారాయణ