అద్దంలో తమ ప్రతిబింబాన్ని చూసుకుని మురిసిపోని వారెవరు? అది మన ముఖాన్ని అచ్చుగుద్దినట్లు ఉన్నది ఉన్నట్లు చూపుతుంది. మనలోపాలను యథాతథంగా చూపుతుంది. అద్దం కిందపడి ముక్కలైనా ప్రతి ముక్కలోనూ నిజమే కనిపిస్తుంది తప్ప లేనిది కనిపించదు. అందుకే ప్రవక్త (స) ‘ఒక విశ్వాసి మరో విశ్వాస సోదరునికి అద్దంలాంటివాడు’ అన్నారు. సగటు ముస్లిం అద్దంలా ఎప్పుడూ సత్యమే పలకాలన్నది ప్రవక్త ఉద్బోధ. నిజాన్ని నిర్భీతిగా చెప్పాలి. మంచికి ప్రతిబింబంగా మారాలి.
ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు మాట్లాడటం విశ్వాసికి శోభించదు. చేదుగా అనిపించినా సత్యమే పలకాలని ప్రవక్త (స) బోధ. నిజం చెప్పడం వల్ల మొదట్లో కొన్ని ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా.. అంతిమంగా మన వ్యక్తిత్వం వికసిస్తుంది. దానికి భిన్నంగా చీటికీమాటికీ అబద్ధాలు చెబుతూ తిరిగేవారి వ్యక్తిత్వానికి మాయని మచ్చ ఏర్పడుతుంది. అందుకే సత్యం పలకడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మానుకోకూడదు. అప్పుడు అల్లాహ్ దగ్గర మన పేరు సత్యసంధుల జాబితాలో చేరుతుంది. అందుకే అబద్ధానికి ఆమడ దూరంలో ఉండాలని బోధించారు ప్రవక్త.