Karthika Pournami | ఏ పున్నమి సౌందర్యం ఆ పున్నమిదే. కానీ, కార్తిక పౌర్ణమి మాత్రం.. వేయిపున్నముల సరిసాటి. ఆ కలికి వెన్నెల కెరటాలపై తేలియాడుతూ తన ప్రేమికుడు ముంగిట్లో వాలిపోతాడని ఓ పడుచు పరవశంగా పాడుకుంటుంది. ఆకాశం డాబా మీద అమ్మ శుభ్రంగా ఉతికి ఆరేసిన నాన్నగారి తెల్లచొక్కాతో పోలుస్తాడు ఆధునిక కవి. ఆ వెన్నెల కాంతులు ప్రసరించిన నీళ్లు.. అమృతంతో సమానమని చెబుతారు ఆయుర్వేద వైద్యులు. భారతీయులు చంద్రుడిని అమ్మ పుట్టింటి చుట్టంగా చూస్తారు. మేనమామగా భావిస్తారు. ఇదొక ఆత్మీయతా చిహ్నం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అంతరిక్షంలోకి పంపించిన చంద్రయాన్- 3 ఇప్పటికే చందమామ దక్షిణ ధ్రువాన్ని చేరుకుని తన పని తాను మొదలుపెట్టింది. ఈ ఘనత సాధించిన తొలిదేశంగా భారత్ చరిత్రపుటల్లో నిలిచిపోయింది. చల్లటి వెన్నెల కురిపించే చందమామ గురించి మన పురాణాల్లో, ప్రజల నోళ్లలో ఎన్నో కథలు ఉన్నాయి. వాటిలో కొన్ని…
మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ తన నుదుటిపై అర్ధచంద్రుడి తిలకం ధరించినట్లు ఉంటుంది. చంద్ర కోర్గా పిలిచే ఈ బొట్టు వెనక ఒక కథ ప్రచారంలో ఉంది. స్వరాజ్య స్థాపన దిశగా మహారాష్ర్టులకు స్ఫూర్తిదాయకంగా ఉండటానికి ఆయన ఇలా చేశాడట. చంద్రోదయం అయ్యిందంటే అమావాస్య కటిక చీకటి ముగిసినట్టే. అంతేకాదు, దినదిన ప్రవర్ధమానమయ్యే నిండు చంద్రుడిలా తన సామ్రాజ్యం కూడా పెరిగి పెద్దది అవ్వాలనే శివాజీ కాంక్షకు ఆయన నుదుట కొలువుదీరిన అర్ధ చంద్రుడు సంకేతం అంటారు. అప్పటినుంచి మహారాష్ట్ర శౌర్యానికి నిదర్శనంగా స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా నుదుటి మీద అర్ధచంద్ర తిలకం ధరిస్తున్నారట. శివరాజు స్ఫూర్తిని కొనసాగిస్తున్నారట.
భారత ప్రధాన న్యాయమూర్తి పేరు జస్టిస్ ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్. ఈ పేరులో చంద్రచూడ్ అంటే చంద్రుడికి ఆశ్రయం ఇచ్చినవాడు- శివుడు అని అర్థం. చంద్రుడు శివుణ్ని ఆశ్రయించడం వెనక ఓ కథ ఉంది. పురాణాల ప్రకారం చంద్రుడికి 27 నక్షత్రాలు భార్యలు. వీరిలో రోహిణి అంటే అతనికి వల్లమాలిన ప్రేమ. దాంతో నక్షత్రాల తండ్రి, చంద్రుడి మామ అయిన దక్ష ప్రజాపతి అల్లుడిని క్షీణించి పొమ్మంటూ శపించాడు. మరో కథ ప్రకారం.. చంద్రుడు దేవగురువు బృహస్పతి భార్య తారతో ప్రేమలో పడతాడు. అది గ్రహించిన బృహస్పతి చంద్రుడిని క్షీణించిపోవాలని శపిస్తాడు. క్షీణిస్తే తన ఉనికి ఉండదని గ్రహించిన చంద్రుడు తరుణోపాయం కోసం దేవతలను ఆశ్రయిస్తాడు. వాళ్లు శివుణ్ని పూజించమని సూచిస్తారు. శివుడి తలమీదున్న గంగమ్మ మరణించిన వారికి మళ్లీ బతుకునిస్తుంది కాబట్టి… గంగ సాయంతో చంద్రుడు క్షీణించకుండా పరమేశ్వరుడు వరమిస్తాడని దేవతలు ఈ సలహా ఇచ్చారు. ఆ మేరకు శివుడి గురించి చంద్రుడు తపస్సు చేస్తాడు. దానికి మెచ్చిన శివుడు గుజరాత్లోని సోమనాథ్ దగ్గర ప్రత్యక్షమయ్యాడని అంటారు. అక్కడే చంద్రుడిని తన శిరస్సున ధరించాడట. దాంతో మళ్లీ పెరగడం మొదలు పెట్టాడు. ఇక వేదాలలో సోమ అనే ఒక మూలికను పేర్కొన్నారు. పునఃసృష్టి చేసే సామర్థ్యం ఉన్న శక్తిమంతమైన సోమ సాక్షాత్తూ శివుడే అని పేర్కొంటారు. అయితే, కాలక్రమంలో సోమ మూలిక చంద్రుడికి పర్యాయంగా మారిపోయింది.
మత చిహ్నాల విషయానికి వస్తే చంద్రరేఖను ఇస్లాం మతానికి గుర్తుగా పరిగణిస్తారు. టర్కీ, పాకిస్తాన్ దేశాల జాతీయ పతాకాల్లో కూడా ఇది దర్శనమిస్తుంది. అయితే ఇది 15వ శతాబ్ది నుంచి పశ్చిమ ఆసియా, తూర్పు ఐరోపా ఖండాలను పరిపాలించిన ఒట్టోమాన్ సామ్రాజ్యం చిహ్నం కావడం గమనార్హం. అలా 15వ శతాబ్ది నుంచి పతాకం మీద చంద్రరేఖకు చోటు దక్కిందన్న మాట. ఒట్టొమాన్ సామ్రాజ్య స్థాపకుడు ఉస్మాన్ ఒకసారి చంద్రరేఖ ఆకాశంలో ఒకవైపు నుంచి మరోవైపు చివరి వరకు ఉన్నట్టు కలగన్నాడట. అలా తన సామ్రాజ్యం కూడా విశాలంగా దిగంతాల వరకు వ్యాపించాలనే దానికి చంద్రరేఖను సంకేతంగా భావించాడు. అప్పటినుంచి నాలుగు వందల సంవత్సరాల పాటు ఒట్టొమాన్ సామ్రాజ్య కేతనంగా చంద్రరేఖ అలరారింది. అయితే ఒట్టొమాన్ సుల్తానులు రాజరికంతోపాటు, ఇస్లాం మతానికి ఖలీఫాలుగా కూడా వ్యవహరించారు. దాంతో ఇస్లాం మతానికి చంద్రరేఖ చిహ్నంగా మారిపోయింది.
చంద్రుణ్ని రాజసానికి ముడిపెట్టడం ప్రాచీన కాలం నుంచీ ఉన్నదే. మౌర్య వంశ స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడికి ఆ పేరు అతని తల్లి ముర చంద్రుడి నీళ్లు (మూన్ వాటర్) తాగాలని కోరుకున్నందు వల్లే వచ్చిందని జైన గాథల నుంచి తెలుస్తున్నది. పున్నమి వెన్నెల్లో తడిసిన చంద్రజలాన్ని ఆర్య చాణక్యుడే స్వయంగా ముర చేత తాగించాడట. అంతేకాదు, మౌర్యుల తర్వాత ఉత్తర భారతదేశాన్ని పాలించిన గుప్త రాజుల్లో కూడా ఇద్దరు చంద్రగుప్తులు కనిపిస్తారు. ప్రసిద్ధ ఖజురహో దేవాలయాల నిర్మాతలు చందేలులు చంద్రుడిని తమ మూల పురుషుడిగా పేర్కొన్నారు.
సంస్కృతంలో చంద్రుణ్ని మాస్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ పదం వేదకాలపు ఆర్యుల భాషలోనిది కాదని, దీని మూలాలు స్థానిక ముండా తెగలో కనిపిస్తాయని భాషావేత్తలు అంటున్నారు. ఆర్య పురుషులు స్థానిక ఆదివాసి స్త్రీలను పెండ్లి చేసుకోవడంతో భాషలో వారి ధ్వనులు కూడా చేరాయట. ముండా ఆదివాసులు చంద్రుణి ‘మా’ అని పిలుస్తారు. అలా చంద్రుడు పెరగడం, తగ్గడం జరిగే క్రమానికి మాసం అనే పేరు వచ్చింది. నిండు చంద్రుణ్ని పూర్ణ-మా అని, చంద్రుడు కనిపించని దినాన్ని అ-మా(వాస్య) అని పిలవడం అలా పుట్టుకొచ్చిందే.
కళా ప్రపంచంలో.. లేడి, బాతులు లాగుతుంటే చంద్రదేవుడు రథంలో పయనిస్తున్న చిత్రాలు దర్శనమిస్తాయి. ఆయన చేతిలో ఒక కుందేలు ఉంటుంది. కుందేలును సంస్కృతంలో శశకం అంటారు. అందుకే చంద్రుడు శశాంకుడు అయ్యాడు. అయితే ఇది మామూలు కుందేలు కాదు. సాక్షాత్తూ బుద్ధుడే. జాతక కథల ప్రకారం గౌతమ బుద్ధుడి పూర్వజన్మల్లో కుందేలు రూపం కూడా ఒకటి. బుద్ధుడు ఒకానొక జన్మలో కుందేలుగా జన్మిస్తాడు. ఆ జన్మలో ఒకసారి తీవ్ర ఆకలితో ఉన్న ఒక వ్యక్తిని చూస్తాడు. తనకు తానుగా చితిపేర్చుకుని మాంసంగా మారి ఆ పస్తులు ఉన్న వ్యక్తికి ఆహారమైపోతాడు. కుందేలు త్యాగానికి ఆకాశంలో ఉన్న దేవతలు అబ్బురపడతారు. చంద్రుడి మీద చిరస్థాయిగా నిలిచిపోయేలా చేస్తారు. చంద్రుడి మీద కుందేలు మచ్చల కథ నేపథ్యం ఇదే.
ఈ కథలన్నీ భారతీయ సంస్కృతిలో చంద్రుడి పాత్రను గుర్తుచేస్తాయి. శుక్ల, కృష్ణ పక్షాల మధ్య.. పెరుగుతూ, క్షీణించే చంద్రుడు మనకు జీవితంలో హెచ్చుతగ్గులు సహజమే అని సందేశం ఇస్తాడు. కష్టసుఖాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయని, ఏదీ శాశ్వతం కాదని చంద్రకళల సారాంశం.