వివేకానంద యుక్త వయసులో ఉన్నప్పుడు తండ్రి విశ్వనాథ దత్తా హఠాత్తుగా కన్నుమూశారు. ఒక్కసారిగా ఆ కుటుంబమంతా పేదరికంలో కూరుకుపోయింది. పెద్ద కుమారుడైన వివేకానంద అత్యంత మేధావి, పట్టభద్రుడు. అయినా ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. తల్లీ, చెల్లెళ్లు, తమ్ముళ్లకు ఆయనే ఆధారం. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో తన గురువు దగ్గరికి వెళ్లి తన కష్టాన్ని చెప్పుకొన్నారు. అప్పుడు ఆ పరమహంస సమీపానే ఉన్న దక్షిణేశ్వర కాళీ ఆలయం వైపు చూపిస్తూ ‘ఇవాళ మంగళవారం, ఈ రోజున అమ్మవారిని ఏది కోరితే అది అనుగ్రహిస్తుంది. వెళ్లి ఆమెను ప్రార్థించు’ అని చెప్పారు.
ఆ రోజు సాయంత్రం వివేకానంద కాళీ మందిరానికి వెళ్లి అమ్మను ప్రార్థించారు. అతను ఆలయం నుంచి తిరిగి వచ్చాక రామకృష్ణులు అతనితో ‘అమ్మ ఏమంది?’ అని అడిగారు. ‘అరే! ఆమెను అడగటం మరచిపోయానే’ అని వివేకానంద మథనపడ్డారు. ‘మరచిపోయావా? మళ్లీ వెళ్లు. త్వరగా వెళ్లు’ అని పరమహంస తన శిష్యుడిని మళ్లీ ఆలయానికి పంపారు. అప్పుడూ అదే పరిస్థితి. అలాగే మూడోసారి స్వామీజీ కాళి ఆలయానికి వెళ్లారు.
అక్కడినుంచి వచ్చాక వివేకానంద ఎలాంటి అలజడి లేకుండా చాలా ప్రశాంతంగా కనిపించారు. పరమహంసతో ‘జగన్మాతను నేను డబ్బు కావాలని ఎలా అడగగలను? అది మహారాజు దగ్గరకు వెళ్లి గుమ్మడికాయ అడిగినట్లు ఉంటుంది! భక్తి, నిస్వార్థ ప్రేమ, ఆమెను అర్థం చేసుకునే శక్తిని ఇవ్వమని అమ్మను ప్రార్థించాను’ అన్నారు వివేకానంద. కానీ, అమ్మవారి కృప, గురువుగారి ఆశీస్సుల ఫలితంగా అప్పటినుంచి వివేకానంద కుటుంబానికి అవసరమైన సాధారణ వసతులకు ఎలాంటి లోటూ రాలేదు.
– మనోజ్ఞ