వేదవేద్యుడు విష్ణువు కృష్ణునిగా అవతరించగా వేదమే అపర వాసుదేవుడైన వ్యాసుని వలన భాసురమైన భాగవతంగా ఆవిర్భవించింది. ఈ పురాణంలో ఆది, మధ్య, అవసానాలలో భక్తి, జ్ఞాన, వైరాగ్య జనకాలైన కథానకాలు అనేకం. కృష్ణ చరితం ఆసాంతం వేదాంత వైవిధ్య భరితం. సంస్కృత భాగవతాన్ని భాషాంతరీకరించిన (తెనిగించిన) కతన- కారణాన, పోతనకే కాక భాగవతానికి కూడా పునర్జన్మ లేకుండా పోయింది కదా! ఆంధ్ర భాగవతంలోని వేదాంత పరమైన అనేక పద్యాలు, పొగమంచును తెగటార్చే ఛాయాపతి- సూర్యుని వలె జీవుల మాయా తిమిరాన్ని- చీకటిని పోకార్చే అధ్యాత్మ ప్రదీపాలు. బ్రహ్మవిద్యను బోధించే ‘ఆంధ్రోపనిషత్తులు’గా అద్యావధి- నేటి వరకు కడు హృద్యాలై కాంతులీనుతున్నాయి.
శుకయోగి పరీక్షిత్తుతో.. రాజా! అనంతుడు- ఆదిశేషుడు అవనిపై బలరామునిగా అవతరించిన అనంతరం, అనాది నిధనుడు ఆదినారాయణుడు మేదినీ- భూమి భారం అంతం చేయడానికి తన నితాంత- సంపూర్ణ తేజంతో- షోడశ కళలతో ఆనక దుందుభి- వసుదేవుని అంతరంగంలో ఆవహించాడు. అమోఘమైన ఆ వైష్ణవ తేజాన్ని వసుదేవుడు మనసా- మానసీ దీక్షగా దేవకీ దేవి యందు ప్రవేశపెట్టాడు. తూర్పుదిక్కు చంద్రుని ధరించిన విధంగా ఆమె ఆ తేజాన్ని మనస్సుతో ధరించింది. పున్నమి నాటి యామినీ నాథుని- చంద్రుని, ఉదయంతో తూర్పుదిక్కు అనే భామిని- స్త్రీ ప్రకాశించునట్లు వసుదేవుని కామిని దేవకి దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఇతర జీవులకు వలె పరమాత్మకు పితర వీర్య సంబంధం లేదని పరమార్థం! అనంత బ్రహ్మాండాలను తన ఉదరంలో పదిలంగా దాల్చిన దామోదరుడు- మహావిష్ణువు భూలోకాన్ని రక్షించడానికి బాలామణి దేవకి గర్భంలో చూలై- లీలా శిశువై బాల భానుని వలె వర్ధిల్లుతున్నాడు.
వేదంలో మాధవునికి- పరమాత్మకు గర్భవాసం ఏ విధంగానూ చెప్పబడలేదు. మరి ఈ గర్భ వర్ణన ఏమిటి? ‘గర్భే చ వాయునా పూర్ణే నిర్లిప్తో భగవానజిత్’ (బ్రహ్మవైవర్త పురాణం కృష్ణజన్మ ఖండం)- గర్భం గాలిచే పూరింపబడటం వల్ల దేవకి చూసేవారికి చూలింత వలె తోచిందట! కంసుని అధీనంలో- చెరలో ఉంటూనే దేవకీ వసుదేవులు చిరకాలం సాధన చేసి తాము జననీ జనకులుగా రమారమణుని కమనీయ అవతరణకు అధికారం- యోగ్యత సాధించారు. ఆ పుణ్యదంపతులు కారాగృహంలో కంసుని ఎగ్గు (అపకారం, అనాదరణ)లతో మగ్గుతూ కూడా నిగ్రహంతో గోవిందుని అనుగ్రహం అందుకొని ఆయనను నందను(పుత్రు)నిగా పొందగలిగారు. ‘సాధనాత్ సాధ్యతే సర్వం’- సాధన ద్వారా సాధ్యం కానిది లేదు కదా!
కం॥ ‘జ్ఞాన ఖలునిలోని శారదయును బోలె
ఘటములోని దీపకళిక వోలె
భ్రాతయింట నాఁకఁ బడియుండె దేవకీ,
కాంత విశ్వగర్భ గర్భ యగుచు’
విశ్వాన్ని తన కుక్షిలో నిక్షిప్తం చేసుకొన్న నీరజాక్షుడు- విష్ణువునే తన గర్భంలో అర్భకునిగా- బిడ్డగా ధరిస్తూ ఉన్నా కూడా దేవకి, యోగ్యులైన శిష్యులకు నిష్కపటంగా బోధించక తనలో దాచుకునే జ్ఞాన వంచకుని విద్యవలె, లోపల వెలుగుతున్నా వెలుపలికి శోభించని.. కుండలో దాచిన దీపజ్వాల వలె, అన్న కారాగృహంలో నిర్బంధంలో ఉన్నందున ఎల్లరకు ఆహ్లాదం కలిగిస్తూ విరాజిల్లలేకపోయింది. ‘సర్వజగన్నివాస నివాస భూత’ అని ఉన్న మూలానికి పోతన్న గారి ‘విశ్వగర్భ గర్భ’ అన్న తెనుగు సేత ఎంత మధుర భావ గర్భితంగా ఉందో చూడండి!
కారాగేహంలో దేవకి దేహాన్ని పరికించిన కంసునికి- మునుపెన్నడూ ఇలా శోభించని ఈమె గర్భంలో ఇప్పుడు వెన్నుడు- నా ప్రాణాలను హరించు అరి (శత్రువు) శ్రీహరి దూరి ఉంటాడన్న సందేహం మితిమీరింది. సోదరి దరి చేరి మనసులో పరిపరివిధాల ఇలా తలపోశాడు… ‘ఈ ఇంతి గర్భం అంతకంతకూ అధిక కాంతివంతమవుతోంది. చూలింత! చెల్లెలు!- ఎలా చంపేది? చంపితే నా ఆయువు, ఐశ్వర్యం, యశము, ధర్మం- అన్నీ చెడిపోవా? చంపక మానితే నా ప్రాణానికే హాని కదా! ఏదేమైనా భగినిని చంపడం భయంకర పాపం’ అని భావించి లోలోపల కల్లోలపడుతున్నా పైన గాంభీర్యం పులుముకొని అలవి కాని అలుక- వైరంతో- ‘బిడ్డ పుట్టనీ, పురిటింటిలోనే వాణ్ని పట్టి మట్టుపెడతా’ అనుకొని కానుపు కోసం కనిపెట్టుకు కూర్చున్నాడు. శుక ఉవాచ…
కం॥ ‘తిరుగుచుఁ గుడుచుచుఁ ద్రాగుచు
నరుగుచుఁ గూర్చుండి లేచు చనవరతంబున్
హరిఁదలఁచి తలచి జగ మా
హరిమయ మని చూచెఁ గంసుఁడారని యలుకన్’
‘రాజా! శ్రీహరిపై గల వైరం వలన తింటున్నా, తిరుగుతున్నా, తాగుతున్నా, తూగుతున్నా, కూర్చున్నా, లేచినా కంసుడు… చల్లారని పగతో ఉల్లం-మనస్సులో మరో ధ్యాస లేకుండా నిరంతరం హరినే తలుస్తూ ప్రహ్లాదుని వలె జగమునంతా హరిమయంగా చూడసాగాడు’. ‘అపశ్యత్ తన్మయం జగత్’ (జగమాహరి మయమని చూచె) అన్న మూలానికి పోతన్న చేసిన ఇంపైన వ్యాఖ్యానంతో కూడిన పెంపుదల..
సీ॥ శ్రవణ రంధ్రముల నే శబ్దంబు వినఁబడు
నది హరిరవ మని యాలకించు,
నక్షిమార్గమున నెయ్యది చూడఁబడు నది
హరిమూర్తి గానోపు నంచుఁ జూచుఁ,
దిరుగుచో దేహంబుఁ దృణమైన సోకిన
హరి కరాఘాతమో యనుచు నులుకు,
గంధంబు లేమైన ఘ్రాణంబు సోకిన
హరిమాలికా గంధమనుచు నదురుఁ’
ఆ॥ ‘బలుకు లెవ్వియైనఁ బలుకుచో హరి పేరు
పలుకఁ బడియె ననుచు బ్రమసి పలుకుఁ
దలఁపు లెట్టివైనఁ దలఁచి యా తలఁపులు
హరి తలంపు లనుచు నలుగఁ దలఁచు’
‘కంసుడు.. చెవులకు ఏ మాట వినిపించినా అది హరి మాటేనని మాటేసి వింటాడు. కన్నులకు ఏది కనిపించినా అది తన్ను మన్ను కరిపించే వెన్నుని (విష్ణుని) రూపమేనని పరికించి ఖిన్నుడవుతాడు. ఒంటికి గడ్డిపరక తగిలినా, అది శ్రీహరి చేతి చావు దెబ్బేనని ఉలికిపడి గావుకేక పెడతాడు. ముక్కురంధ్రాలకు ఏ వాసన సోకినా అది ముకుందుని వనమాలికా గంధమే అని అదరిపోతాడు. నోట ఏ మాట వచ్చినా వనమాలి పేరే పలికానని భ్రమపడి బెదరి ఆ పేరే పలవరిస్తాడు. తన తలపులు- ఆలోచనలన్నీ అచ్యుతుని ఆలోచనలేమో అని ఆగ్రహిస్తాడు’ ఇలా శబ్ద స్పర్శ రూప రస గంధాలనే విషయాలను గ్రహించే కంసుని ఇంద్రియాల వ్యాపారాలన్నీ ఇందీవర శ్యాముని- విష్ణుని చేష్టలే అయ్యాయి. ఇలా అతనికి నిరోధం- మనోలయం కలిగింది. ప్రపంచ విస్మరణ, పరమాత్మ అఖండ స్మరణ!- ఇదే నిరోధం! కంసుని చిత్తంలో ఒకే వృత్తి- అంతఃకరణ ప్రవృత్తి- విష్ణు భయవృత్తి! ఈ భయంతోనే కంసుడు ‘అభయ’ పదవి- ముక్తి పొందాడు. నారద మహర్షి కంసునికి చేసిన మహోపకారం ఇదే!
‘భయం’ కూడా భగవత్ప్రాప్తికి ఒక యోగం- ఉపాయం, సాధనమన్నమాట! తుమ్మెద ఒక పురుగును తెచ్చి, నిర్బంధించి దాని చుట్టూ ఝంకారం చేస్తూ, తిరుగుతూ ఉంటుంది. ఆ పురుగు, భయంతో ఎదలో ఆ తుమ్మెదనే తలచి తలచి భ్రాంతిపడి చివరికి తుమ్మెదగా మారుతుంది. దీనికే భ్రమర కీట న్యాయం, ‘భయ యోగం’ అని పేరు. వైర మూలకమైన స్వామి స్మరణ కూడా ముక్తి దాయకమేనని ఘోషించింది… ధరణి (భూమి) మీద సనాతన ధర్మవాణి మాత్రమే! ఎవనికైనా శత్రువును గురించిన స్మరణ రేయింబవళ్లు నిరంతరంగా సాగుతుంది. భక్తికి నోచుకోని దానవులందరూ భగవంతుని పట్ల వైరం (విరోధం) వహించి శ్రీహరి సారూప్యాన్ని వరించారు.
భగవంతుని యందు వైర భావం వలన ఏర్పడే తన్మయత్వం భక్తి వల్ల కూడా కలగదని భక్తి దర్శనానికి ఆచార్యుడైన నారద మహర్షి మతం! సాధన బాహుళ్యం- పరమాత్మ ప్రాప్తికి సాధనాలు అనేకంగా ఉండవచ్చన్న భావం, ఉపాస్యానా మనియమం- ‘ఫలానా దైవమే ఉపాసించ తగినది’ అనే నియమం లేకుండుట… ఇవి సనాతన వైదిక ధర్మ విశిష్టతలు మాత్రమే! ‘యద్యత్ పశ్యతి చక్షుర్భ్యాం, యద్యత్ శృణోతి కర్ణాభ్యాం, యద్యత్ స్పృశతి హస్తాభ్యాం… తత్తదాత్మేతి భావయేత్’ (నేత్రాలకు కనిపించే రూపాలన్నీ, శ్రోత్రాలకు వినిపించే శబ్దాలన్నీ, హస్తాలకు తగిలే- తాకే స్పర్శలన్నీ ‘ఆత్మ’ మాత్రమే అని భావించాలి) ‘యోగ తత్తోపనిషత్తు’ చేసే ఈ ఘోష (గోస)-ధ్వనికి ప్రతిధ్వనియే పోతన గారి పై సీస పద్యం!
(సశేషం)
–తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ98668 36006