తిరుమల : తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ఏడో రోజైన సోమవారం సూర్యప్రభ వాహనంపై వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చారు. ఆలయం వద్దగల వాహన మండపంలో ఉదయం 8 నుంచి 9 గంటల వరకు అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది.
సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణుడు. లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండలాంతర్గతుడై వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. సూర్యభగవానుని కిరణస్పర్శతో పద్మాలు వికసిస్తాయి. అలాంటి పద్మాలే లక్ష్మికి నివాసస్థానాలు. సూర్యనారాయణుని సాక్షిగా తిరుచానూరులో శ్రీవారు తపమాచరించి కృతార్థులయ్యారు. సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం, సుజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం.
అమ్మవారికి గాజులు విరాళం
తిరుపతికి చెందిన పొన్నాల సుధాకర్, ఉదయ్ అనే భక్తులు సోమవారం ఉదయం 100 డజన్ల గాజులు, హుండీ బట్టలు విరాళంగా అందించారు. వీటిని జేఈవో వీరబ్రహ్మంకు అందజేశారు. వాహనసేవలో పెద్దజీయర్ స్వామి, చినజీయర్ స్వామి, జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో కస్తూరిబాయి, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, పాంచరాత్ర ఆగమసలహాదారు శ్రీనివాసాచార్యులు, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్లు శేషగిరి, మధుసూధన్, ఏవీఎస్వో వెంకటరమణ, టెంపుల్ ఇన్స్పెక్టర్ రాజేష్ కన్నా పాల్గొన్నారు.