తిరుపతి : తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు మధ్యాహ్నం శుక్రవారపుతోటలో స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. సోమవారం ఉదయం 7 నుంచి 8.30 గంటల వరకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. వసంతోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అమ్మవారి ఉత్సవర్లను ఆలయం నుంచి శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. 2.30 నుంచి 4.30 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.
ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. సాయంత్రం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు జరిగాయి. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించనున్నారు. గృహస్త భక్తులు ఒక్కొక్కరు రూ.150 చెల్లించి ఒక రోజు వసంతోత్సవంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. వసంతోత్సవం కారణంగా ఆదివారం కల్యాణం, ఊంజల్సేవను రద్దు చేశారు. కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, సూపరింటెండెంట్ మధు, టెంపుల్ ఇన్స్పెక్టర్
దామోదరం పాల్గొన్నారు.