తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవంగా కొలవబడుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకునేందుకు తరలిరావడంతో తిరుమల (Tirumala) కొండ భక్తులతో కిటకిటలాడుతుంది. శ్రీ గోవింద నామస్మరణతో మాడ వీధులు మారుమ్రోగుతున్నాయి.
శనివారం తెల్లవారుజామున 1.45 నిమిషాల నుంచి ప్రారంభమైన వైకుంఠ ఉత్తర ద్వార (Vaikunta Dwara Darsan)దర్శనానికి భక్తులు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో అందుకు అనుగుణంగా టీటీడీ పలు దర్శన చర్యలు తీసుకుంది. 48 గంటల ముందుగానే స్వామివారి వైకుంఠ ద్వారా దర్శనానికి ప్రత్యేక టోకెన్లు జారీ చేసి సర్వదర్శనం టోకెన్లను నిలిపివేసింది.
కొండపై ఉన్న కంపార్టుమెంట్లన్నీ నిండిపోగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు , జడ్జిలు తదితరులంతా ఒకరోజు ముందుగానే ఆలయానికి చేరుకున్నారు. శనివారం స్వామివారిని స్వర్థరథంపై ఊరేగించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. నిన్న స్వామివారిని 40,638 మంది భక్తులు దర్శించుకోగా 21,455 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.46 కోట్లు వచ్చిందని ఆలయ అధికారులు వివరించారు.