ఓ సారి.. బాలుడిగా ముచ్చటగొలుపుతాడు. అంతలోనే దయ్యం పట్టినవాడిగా ముచ్చెమటలు పట్టిస్తాడు. సలక్షణ రూపంతో భక్తుణ్ని సమీపించేది ఆయనే! తనను సమీపించ వచ్చిన భక్తుణ్ని తరిమేదీ ఆయనే! పైపైన అన్వేషిస్తే ఆ తత్వం అంతుబట్టదు. అసలు సత్యం బోధపడదు. అదే దత్తాత్రేయం! అవధూత సంప్రదాయానికి ఆలవాలం. మనోనిగ్రహం ఉన్నవారికి నీడనిచ్చే ఔదుంబరం. కఠోర పరీక్షకు నిలిచినవాళ్లకు జ్ఞానాన్ని ప్రసాదించే గురుపీఠం.
దత్తాత్రేయుడు యోగి రాజు. ఏ స్థితి లౌకిక బంధనాలకు అతీతంగా విలక్షణంగా కనిపిస్తుందో, ఆ స్థితిని జ్ఞానులు యోగమార్గంలో అనుష్ఠించి గమ్యం చేరుతారు. అటువంటి సవ్యమార్గాన్ని చూపించే గురు సంప్రదాయానికి ఆద్యుడు దత్తాత్రేయుడు. దత్తస్వామి నెలకొల్పింది అవధూత సంప్రదాయం. అవధూత అంటే.. పూర్తిగా దేహధ్యాస లేనివారు. లౌకిక ప్రపంచం, బంధాలు, బంధుత్వాలు పట్టనివారు. వారు ఎక్కడా నిలవరు. ఆవు పాలు పితికినంత సేపే వారు ఒకచోట ఉంటారు.
‘అక్షరాత్, వరేణ్యాత్, ధూత సంసార బంధనాత్, తత్వ మస్యాది లక్ష్యత్వాత్, అవధూత ఇతీర్యతే’ ఆశా పాశాల నుంచి విముక్తి పొందిన వాడు, పూర్వకర్మల నుంచి విడివడిన వాడు, ధూళితో కూడిన శరీరం వాడు (దేహం పట్ల అభిమానం లేనివాడు), తత్వ చింతన కలవాడు అవధూత అంటుంది దత్తావధూతగీత. దీన్నే అవధూత ఉపనిషత్తు ఇంకాస్త విశదంగా చెప్తూ అవధూత అంటే అక్షరుడు (నాశనం లేనివాడు), వరేణ్యుడు (ఉత్తముడు), ధూతబంధనుడు (సంసార బంధనాలేవీ లేనివాడు) వేదాంత గోచరమైన తత్వమస్యాది వాక్యాలకు లక్ష్యమైన వాడని చెబుతుంది. ఈ లక్షణాలన్నీ కలిగి బ్రహ్మ, విష్ణు,మహేశ్వరుల అంశతో త్రిమూర్తి స్వరూపంగా అవతరించిన పరబ్రహ్మ స్వరూపమే దత్తావతారం.
లోకంలో మహర్షులందరూ అవధూతలు కారు. వ్యాసుడు మహర్షి. ఆయన కొడుకు శుకమహర్షి అవధూత. శుకమహర్షి తండ్రిని విడిచి వెడుతూంటే పుత్రప్రేమతో వ్యాసుడు ఆయన్ను పిలుస్తూ వెనకాలే వెంబడిస్తున్నాడట. అక్కడ ఒక సరస్సులో స్నానం చేస్తున్న దేవతా స్త్రీలు శుక మహర్షిని పట్టించుకోలేదు. కానీ, వయోవృద్ధుడైన వ్యాసమహర్షి వస్తూంటే మాత్రం సిగ్గుతో వస్ర్తాలు చుట్టుకున్నారట. అదీ అవధూత విశిష్టత.
మహా తపస్సంపన్నుడు అత్రి మహర్షికీ, పతివ్రతా శిరోమణి అనసూయాదేవికి కలిగిన పుణ్య సంతానమే దత్తాత్రేయ స్వామి. సత్వ, రజో, తమో గుణాలు లేనివాడు అ‘త్రి’ మహర్షి. న+ అసూయ అసూయా గుణం లేని, మరోవిధంగా చెబితే మాయను వదిలిన తత్వం గలది అనసూయా మాత. అందుకే త్రిగుణాతీతుడై మాయారహితుడైన అవధూత స్వరూపంగా దత్తాత్రేయుడు ఉద్భవించాడు. అత్రి తనయుడు కనుక ఆత్రేయుడు, తనకు తానుగా దత్తమయినాడు (తల్లిదండ్రులకు ఇవ్వబడినాడు) కాబట్టి దత్తుడు. వెరసి దత్తాత్రేయుడు అయ్యాడు. ‘గురుదత్తా! జగత్తును అంధకారం నుంచి కాంతిమార్గంలోకి నడిపించడానికి అవతరించిన జగద్గురువు నువ్వు’ అని తల్లిదండ్రుల నుంచి ఆశీఃపూర్వక అభినందనలు పొందిన దత్తుడు.. జగదోద్ధరణ కోసం సహ్యాద్రి పర్వతాలకు వెళ్లాడు.
దత్తాత్రేయుడు అవతరించిన మార్గశిర పౌర్ణమిని దత్త జయంతిగా చేసుకుంటాం. దత్తాత్రేయునిది జ్ఞానావతారం. విష్ణుమూర్తి ఏకవింశతి (21) అవతారాలలో ఆరోది దత్తరూపం. ఆయన కరుణా సముద్రుడు. ఒక్కోసారి భక్తులను కఠిన పరీక్షలకు గురిచేస్తాడు. ఆయన కనబరిచే ప్రతి లీలా ఓ సత్యాన్ని ఆవిష్కరిస్తుంది. ఓ తత్వాన్ని బోధిస్తుంది. అవతార లక్ష్యం పూర్తికాగానే విష్ణుమూర్తి ఆ అవతారం చాలించడం కనిపిస్తుంది. కానీ, దత్తావతారం పరిసమాప్తి లేనిది. గురు రూపంలో ఆయన చిరంజీవి.
దత్తుడు ఏ చీకూచింత లేకుండా నిరంతరం ఆనందమయ పరబ్రహ్మ స్థితిలో ఉండటానికి కారణమేమిటో తెలుసుకోవాలనుకున్నాడు యదువు (యాదవ వంశానికి మూల పురుషుడు). దానికి సమాధానం ఇస్తూ దత్తుడు లోకాన్ని అవలోకనం చేసుకోవడం వల్ల ఎంతో జ్ఞానాన్ని అందించే గురువులను పొందానని చెబుతాడు. ‘ప్రకృతే నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. భూమి క్షమాగుణాన్ని, వాయువు నిస్సంగత్వాన్ని, ఆకాశం సర్వవ్యాపకత్వాన్ని, జలం నిర్మలత్వాన్ని, అగ్ని తేజస్సును నేర్పించాయి. సూర్యుడు, చంద్రుడు, పావురాల జంట, సర్పం, సముద్రం, మిడత, తేనెటీగ, ఏనుగు, తుమ్మెద, లేడి, చేప, వేశ్య, బాలుడు, బాలిక, కన్యక, సాలెపురుగు.. ప్రతిదీ తనకు గురువుగా నిలిచాయ’ని చెబుతూ 24 మంది గురువుల ద్వారా తను నేర్చుకున్న విషయాలను తెలియజేస్తాడు దత్తాత్రేయుడు. జీవన సాఫల్యానికి ప్రకృతి పరిశీలన అవసరమని, జీవితంలో తారసపడే ప్రతి సంఘటన నుంచి పాఠాలు నేర్చుకోవచ్చని దత్తుడి జీవితం మనకు ప్రబోధిస్తుంది.
దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం
ప్రపన్నార్తి హరంవందే స్మర్తృగామీ సనోవతు॥
దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి
తన్నో దత్తః ప్రచోదయాత్
తాత్వికంగా స్వామి దిగంబరుడు (దిక్కులే వస్ర్తాలుగా కలవాడు). కేవల బ్రహ్మనిష్ఠతో దండకమండలాలను కూడా వదిలిన శుద్ధ సాత్విక చైతన్య మూర్తి అయిన అవధూత. భక్తితో స్మరిస్తే సంతృప్తిని పొంది తన దివ్యానుగ్రహాన్ని కురిపిస్తాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపాలలో మూడు తలలతో, తెల్లని శరీరంతో, జటలతో, శంఖ, చక్ర, కమండల, జపమాల, త్రిశూల, డమరుకాలు ఆరుచేతులలో ధరించి, నాలుగు వేదాలకు ప్రతీకలైన నాలుగు శునకాలు వెంట ఉండగా.. ధర్మస్వరూపమైన గోవును తన వెనుక నిలుపుకొని ఔదుంబర (మేడి) వృక్షం నీడలో సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపంగా దత్తాత్రేయుడి రూపాన్ని భక్తులు దర్శించుకుంటారు.
– మరుమాముల దత్తాత్రేయ శర్మ