TTD | శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. ఈ నెల 27న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ మాసానికి సంబంధించించిన టికెట్లను 27న ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. ఇక విషయాన్ని భక్తులు గమనించి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకొని సహకరించాలని కోరింది. అలాగే సాలకట్ల వసంతోత్సవకు సంబంధించిన టికెట్లను ఈ నెల 27న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది.
మరో వైపు శ్రీవారి ఆలయానికి భక్తుల రద్దీ కొనసాగుతున్నది. టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి పది గంటల సమయం పడుతున్నది. శుక్రవారం స్వామివారిని 60వేలమందికిపైగా భక్తులు దర్శించుకున్నారు. హుండీల ద్వారా రూ.3.72కోట్ల ఆదాయం సమకూరింది. ఈ నెల 30న శ్రీరామ నవమి సందర్భంగా ఆలయంలో శ్రీరామనవమి, పట్టాభిషేకం ఆస్తానాలను నిర్వహించనున్నట్లు తెలిపింది. 30న హనుమంత వాహన సేవ జరుగనున్నది.
30న ఉదయం 9 నంచి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో సీతారామచంద్ర, లక్ష్మణ సమేత ఆంజనేయస్వామి వారి ఉత్సవర్లకు స్పపన తిరుమంజనం నిర్వహిస్తారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6.30 నుంచి 8 గంటల వరకు హనుమంత వాహనసేవ జరుగుతుంది. ఆ తరువాత రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారువాకిలిలో శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో సహస్ర దీపాలకరణ సేవను టీటీడీ రద్దు చేసింది. 31న బంగారువాకిలిలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు.