TTD news | టీటీడీ గోశాలలో నిర్మిస్తున్న ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ పనుల పురోగతిని టీటీడీ జేఈఓ సదాభార్గవి పరిశీలించారు. అలాగే, అగరబత్తీల రెండో యూనిట్ నిర్మాణ పనులను కూడా చూశారు. యుద్ధప్రాతిపదికన ఈ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. తొలుత ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్లో సివిల్, విద్యుత్, యంత్రాల పనితీరు పరిశీలన పనులను వారం రోజుల్లోపు పూర్తి చేయాలని సూచించారు. ఆమె వెంట పశువైద్య విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ పద్మనాభ రెడ్డి, టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ రెడ్డి, ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈ మనోహర్, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ కుమార్ తదితరులు ఉన్నారు.
అనంతరం ఆమె అగరబత్తీల తయారీ రెండో యూనిట్ పనులు పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న ఉత్పత్తిని రెట్టింపు చేయడానికి అవసరమైన పూల సరఫరా, ఇతర ఏర్పాట్ల గురించి జేఈవో అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సదాభార్గవి మీడియాతో మాట్లాడుతూ.. ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ ఏర్పాటుతో గోశాలలోని ఆవులు, ఎడ్లు, ఇతర జంతువులకు నాణ్యమైన దాణా తయారు చేసి అందించవచ్చునన్నారు. భక్తుల నుంచి విపరీతమైన డిమాండ్ ఉండటంతో అగరబత్తీల ఉత్పత్తిని రెట్టింపు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్, అగర బత్తీల రెండో యూనిట్ను త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సందడిగా ఉద్యోగుల క్రీడాపోటీలు
టీటీడీ ఉద్యోగుల క్రీడాపోటీల్లో భాగంగా టీటీడీ పరిపాలన భవనంలో పాసింగ్ ది లగేజ్, టెన్నికాయిట్ పోటీలు జరిగాయి. 45 ఏండ్లు పైబడిన మహిళా ఉద్యోగుల పాసింగ్ ది లగేజ్ పోటీల్లో ఎస్ కల్పన జట్టు విజయం సాధించగా.. డాక్టర్ జీ నిర్మల జట్టు రన్నరప్గా నిలిచింది. 45 ఏండ్లలోపు మహిళా ఉద్యోగుల టెన్నికాయిట్ సింగిల్స్ పోటీల్లో పీ ధనశ్రీ విన్నర్గా, ఎన్ పద్మజ రన్నరప్గా నిలిచారు. అలాగే, 45 ఏండ్లలోపు మహిళా ఉద్యోగుల టెన్నికాయిట్ డబుల్స్ పోటీల్లో పీ ధనశ్రీ, డీ శ్రీలక్ష్మి జట్టు విజయం సాధించగా, ఎన్ పద్మజ, ఎం సునంద జట్టు రన్నరప్గా నిలిచింది.