TTD News | టీటీడీ ఆధ్వర్యంలోని స్థానికాలయాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తున్నది. తిరుమలతోపాటు స్థానికాలయాల్లో వైకుంఠ ఏకాదశి వచ్చే ఏడాది జనవరి 2 న జరుపనున్నారు. ఏర్పాట్లపై టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం పలు విభాగాల అధికారులతో వర్చువల్ విధానంలో సమీక్షించారు. ఈ సమీక్షకు టీటీడీ ఎస్ఈ-3 సత్యనారాయణ, ఎస్ఈ ఎలక్ట్రికల్ వెంకటేశ్వర్లు, తిరుపతి వీజీఓ మనోహర్, డిప్యూటీ ఈఓలు గుణ భూషణ్ రెడ్డి, గోవిందరాజన్, తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జేఈఓ వీరబ్రహ్మం మాట్లాడుతూ.. టీటీడీ స్థానికాలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని, ఆగమ పండితులు సూచించిన మేరకు ఖచ్చితమైన వేళలు పాటించాలని సూచించారు. ఆలయాలను పుష్పాలు, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లు ఇతర ఇంజినీరింగ్ ఏర్పాట్లు, మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కోరారు. అన్న ప్రసాదాలు, తాగునీటి వసతి కల్పించాలని సూచించారు. భద్రతాపరంగా ఇబ్బందులు లేకుండా స్థానిక పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఆయా ఆలయాల్లో సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించాలని, భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా హెల్ప్ డెస్కులు, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్థానిక అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకొని అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భక్తులను ఆకట్టుకునేలా ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.