తిరుమల : వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఏప్రిల్ నెల ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను శుక్రవారం ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నది. సాఫ్ట్వేర్లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా ఒకటో తేదీకి బదులుగా ఏప్రిల్ 8వ తేదీకి దర్శన టోకెన్ల జారీని వాయిదా వేశారు. రోజుకు వెయ్యి టోకెన్ల చొప్పున జారీ చేయనున్నారు.
9వ తేదీ నుంచి నిర్దేశించిన స్లాట్లలో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారిని అనుమతించనున్నారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రెండేళ్ల తర్వాత వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనాలను టీటీడీ పునరుద్ధరించింది. కాగా, వారిని ప్రతి రోజు ఉదయం 10 గంటలకు స్లాట్లలో దివ్యాంగుల క్యూలైన్ ద్వారా దర్శనానికి అనుమతించనున్నారు. శుక్రవారం మాత్రం మధ్యాహ్నం 3 గంటల స్లాట్ కేటాయించారు. ఈ మేరకు అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరింది.